టీడీపీ గెలుస్తుందని తెలంగాణ ఇంటెలిజెన్స్ వెల్లడించిందట! సర్వే పేరుతో తప్పుడు కథనం..కేసు నమోదు
అమరావతి/హైదరాబాద్, రాష్ట్రంలో పోలింగ్ గడువు సమీపిస్తున్నకొద్దీ నకిలీ సర్వేల బాగోతాలు ఒక్కటొక్కటికగా వెలుగులోకి వస్తున్నాయి. కొద్దిరోజుల కిందటే లోక్ నీతి-సీఎస్డీఎస్ సంస్థ పేరుతో ఓ సర్వే బయటికొచ్చింది. తెలుగుదేశం పార్టీ బంపర్ మెజారిటీ గెలుస్తుందనేది దాని సారాంశం. చివరికి అది నకిలీదని తేలింది. తాము ఎలాంటి సర్వే చేపట్టలేదని, ఇలాంటి తప్పుడు కథనాల వల్ల తమ సంస్థకు చెడ్డ పేరు వస్తోందని, ఆ సర్వేను ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంటూ లోక్ నీతి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ వెంటనే మరో సర్వే బయటికి వచ్చింది. ఈ నకిలీ సర్వే నిజమని నమ్మించడానికి సదరు సంస్థ ఏకంగా తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం పేరును బాహటంగా వినియోగించుకోవడం ఇందులో ట్విస్ట్.
తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు ఏపీలో సర్వే చేయగా..టీడీపీ భారీ మెజారిటీతో ఏపీలో గెలుస్తోందని తేలినట్లు టీఎఫ్సీ మీడియా ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. తన నకిలీ సర్వే కోసం ఆ సంస్థ ఏ మాత్రం బెరుకు, భయం లేకుండా తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం పేరును వాడుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
టీడీపీ కోసం ప్రచారానికి మరో స్టార్ క్యాంపెయినర్... నేటి నుండి నారా రోహిత్ ప్రచార షెడ్యూల్
యూట్యూబ్ లో ప్రసారం..
హైదరాబాద్కు చెందిన టీఎఫ్సీ మీడియా అనే సంస్థ ఈ నకిలీ సర్వేను చేసింది. ఈ సంస్థ రిజిస్టర్డ్ ఆఫీస్ జూబ్లీహిల్స్ లో ఉంది. తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు ఏపీలో సర్వే నిర్వహించగా.. అక్కడ టీడీపీ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించబోతున్నట్లు తేలిందని టీఎఫ్సీ సంస్థ ఓ కథనాన్ని ప్రసారం చేసంది. తొలుత దీన్ని హైదరాబాద్ లో ఇంటెలిజెన్స్ విభాగం ఇన్ స్పెక్టర్ హరిప్రసాద్ గుర్తించారు. వెంటనే- ఆయన తన పైఅధికారులను సంప్రదించారు. ఏపీలో తాము ఎలాంటి సర్వే నిర్వహించలేదని స్పష్టం చేశారు. దీనితో హరిప్రసాద్ రంగంలోకి దిగారు. వెంటనే ఆయన టీఎఫ్సీ మీడియా సంస్థ డైరెక్టర్ శాఖమూరి తేజోభానును సంప్రదించారు. ఆయన పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. దీనితో హరిప్రసాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేసన్ లో ఫిర్యాదు చేశారు. హరిప్రసాద్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
తామెలాంటి సర్వేలూ చేయలేదు..
ఏపీలో ఎన్నికల వ్యవహారంతో తమకు సంబంధం లేదని, తామెలాంటి సర్వేలను చేపట్టలేదని తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు స్పష్టం చేశారు. దేని ఆధారంగా టీఎఫ్సీ మీడియా సంస్థ ఆ కథనాన్ని ప్రసారం చేసిందని ఆరా తీస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేయడంతో.. బుధవారం సాయంత్రానికి శాఖమూరి తేజోభాను తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకోవచ్చని సమాచారం.
మభ్యపెట్టే ప్రయత్నం..
లోక్ నీతి-సీఎస్డీఎస్ సర్వే పేరుతో కొనసాగిన హల్ చల్ సద్దుమణగకముందే తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులను ఉటంకిస్తూ టీఎఫ్సీ మీడియా సంస్థ నకిలీ సర్వే ప్రసారం చేయడం కలకలం రేపింది. ఏపీ ఓటర్లను మభ్యపెట్టి టీడీపీకి అనుకూలంగా ఓటేసేలా చేయాలని కుట్ర పన్నారని, ఇందుకోసం తెలంగాణ ఇంటెలిజెన్స్ పేరును వాడుతూ ఆ విభాగం ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. టీఎఫ్సీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రామకృష్ణ వీరపనేని అనే వ్యక్తికి చెందినదిగా తేలింది. హరిప్రసాద్ తన ఫిర్యాదుతోపాటు యూట్యూబ్ లింకులు, అందులో పొందుపర్చిన అంశాలకు సంబంధించిన వీడియోలను పోలీసులకు అందజేశారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీలోని 171 (సీ), రెడ్విత్, 171 (ఎఫ్), 171 (జీ), 417, 420, 465, 468, 471, 505(1), (సీ), 505(2), రెడ్విత్ 120(బీ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లోని సెక్షన్ 66(డీ) కింద కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ కె.బాలకృష్ణారెడ్డి కేసు దర్యాఫ్తు చేస్తున్నారు.