రాజధాని తరలింపుపై వేదనతో మరో రైతు మృతి .. అమరావతిలో విషాదం
రాజధాని అమరావతిలోనే కొనసాగించాలంటూ అమరావతి 29 గ్రామాల రైతులు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు . సీఎం జగన్ మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటన చెయ్యటమే కాకుండా అసెంబ్లీలో సైతం బిల్లు పెట్టి బిల్లు ఆమోదింపజేశారు . ఈ నేపధ్యంలో ప్రస్తుతం అమరావతి చుట్టూ ఉన్న 29 గ్రామాల రైతులు నిరసనలు ఉధృతం చెయ్యాలని భావిస్తున్నారు. కానీ పోలీసులు ఎక్కడికక్కడ అణచివేతల పర్వాలు కొనసాగిస్తున్నారు.
36వ రోజు ... రాజధాని తరలింపుకు నిరసనలు .. గుంటూరు జిల్లా బంద్.. అనుమతి లేదన్న పోలీసులు
ఇక రాజధాని కోసం పోరాటం చేస్తూ ఆందోళనల్లో పాల్గొంటున్న రైతుల కుటుంబాల్లో విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాజధాని అమరావతి తరలిపోతుంది అని ప్రచారం మొదలైన నాటి నుండి రాజధానిలో రైతులు, కౌలు రైతులు తీవ్ర మానసిక వేదనతో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇక నేడు అందుకు జగన్ నిర్ణయం తీసుకోవటం, మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పటంతో రాజధాని కోసం పోరాటం చేస్తున్న మరో రైతు గుండె ఆగింది.
రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో మరో రైతు నేడు ప్రాణాలు కోల్పోయారు . బుధవారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన కొమ్మినేని పిచ్చయ్య అనే రైతు ఈ తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. రాజధాని అమరావతి కోసం దిగులు పెట్టుకున్న ఆయనకు గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు.దీంతో రాజధాని అమరావతిలో మరో విషాదం చోటు చేసుకుంది.