గుంటూరులో మరో గ్యాంగ్ వార్ - ఈ సారి అమ్మాయి కోసం - చివర్లో పోలీసుల రాకతో...
విజయవాడలో ఓ అపార్ట్ మెంట్ విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో చోటు చేసుకున్న గ్యాంగ్ వార్ ఘటన కలకలం రేపుతుండగానే గుంటూరు జిల్లాలో ఇలాంటిదే మరో గ్యాంగ్ వార్ చోటుచేసుకుంది. అయితే ఈసారి ఈ గ్యాంగ్ వార్ ఆస్తుల కోసం కాకుండా అమ్మాయి కోసం కావడం సంచలనం రేపుతోంది. పోలీసులు చివరి నిమిషంలో ఎంట్రీ ఇవ్వకపోతే ఇందులోనూ పరిస్దితి దారుణంగా ఉండేదని చెబుతున్నారు.
గుంటూరు జిల్లాలో ఒక యువతి కోసం యువకులు రెండు గ్రూప్ లుగా విడిపోయి కొట్లాటకు దిగారు. గుంటూరు రూరల్ చౌడవరం సమీపంలోని ఒక ఇంజినీరింగ్ కళాశాలలో వసంతరాయపురానికి చెందిన ప్రణయ్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కాగా నగరంలోని బృందావన్ గార్డెన్స్ వద్ద అతడికి స్నేహితురాలు ఉంది. కాగా ఆమెకు ఇన్స్ట్రాగామ్లో కృష్ణనగర్కు చెందిన ఆవుల దివేష్ అలియాస్ సన్ని అనే వ్యక్తి మెసేజ్లు పంపుతున్నాడు. సన్నీ తనకు మెస్సేజ్ లు పంపుతున్నాడంటూ విద్యార్థిని ప్రణయ్కు చెప్పడంతో సోషల్ మీడియాలో ఇద్దరూ గొడవ పడ్డారు. చూసుకుందాం రా...అని సవాళ్లు విసురుకున్నారు.
గుంటూరు సమీపంలోని డొంకరోడ్డు వద్ద ఘర్షణకు స్పాట్ ఫిక్స్ చేసుకున్నారు. అక్కడ ఇరు వర్గాలు కొట్లాటకు దిగటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగి యువకులను స్టేషన్ కు తరలించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోబోమని ఏఎస్పీ గంగాధరం స్పష్టం చేశారు. కొంత మంది యువకులను అదుపులోకి తీసుకున్నామని, మరికొంత మందిపై విచారణ జరుగుతోందని తెలిపారు. కాగా ఈ వార్ లో ఓ ఏఎస్ఐ కుమారుడు కూడా ఉండటం విశేషం.