కర్నూలు ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. ఒకరు మృతి..అపస్మారక స్థితిలో పలువురు
నంద్యాల: ఆంధ్రప్రదేశ్ను వరుస గ్యాస్ లీకేజీ ఘటనలు బెంబేలెత్తేలా చేస్తోంది. కొద్ది రోజుల క్రితం విశాఖ ఎల్జీ పాలిమర్స్ సంస్థలో గ్యాస్ లీకైన ఘటన మరువక ముందే తాజాగా కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో ఉన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ సంస్థలో విషవాయువు లీకైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
విశాఖ గ్యాస్ లీక్ ఘటన హైపవర్ కమిటీ విచారణ ... రెండో రోజు విచారణ సాగుతుందిలా!!
ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్
కర్నూలు జిల్లా నంద్యాలలోని కుందూ నది తీరం దగ్గర ఉన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్లో అగ్ని ప్రమాదం జరిగింది. అమ్మోనియం గ్యాస్ లీకవడంతో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అమ్మోనియం గ్యాస్ లీకును నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. అమ్మోనియం గ్యాస్ లీకవడంతో ఆ ఫ్యాక్టరీ జీఎం శ్రీనివాస్ అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ముగ్గురు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ ఫ్యాక్టరీ దివంగత మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డిది కావడం విశేషం. అమ్మోనియం గ్యాస్ లీకవడంతో ఫ్యాక్టరీకి దగ్గరలోని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గ్రామం ఖాళీ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే అమ్మోనియం గ్యాస్ లీక్ ఇంకా కంట్రోల్లోకి రాలేదని సమాచారం.
ఐసు తయారయ్యే సమయంలో గ్యాస్ లీక్
అమ్మోనియం గ్యాస్ లీక్ కావడంతో పలువురు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు సమాచారం. ఇక అమ్మోనియం గ్యాస్ ట్యాంక్ రెండు టన్నుల సామర్థ్యం ఉండటంతో ఇది మరింత భయానికి గురిచేస్తోంది. ఇదిలా ఉంటే ప్రమాదంపై యాజమాన్యం స్పందించింది. ఐస్ తయారు చేసే సమయంలో అమ్మోనియం వినియోగిస్తామని ఆ సమయంలోనే గ్యాస్ లీకైందని ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి చెప్పారు. అయితే గ్యాస్ ప్రభావం ఏమేరకు ఉంటుందనేదానిపై అధికారులు ఇప్పటి వరకు ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే నిపుణులు మాత్రం అమ్మోనియం గ్యాస్ చాలా ప్రమాదకరమైనదని చెబుతున్నారు. మనిషి ప్రాణాలను 10 నిమిషాల్లో తీసేయగలదని చెబుతున్నారు. ఇది గాల్లో 5 కిలోమీటర్ల వరకు వ్యాప్తి చెందే అవకాశం ఉందని వెల్లడించారు.
పరిసరాల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్న పోలీసులు
ప్రస్తుతం అమ్మోనియం గ్యాస్ లీకవడంతో ఫ్యాక్టరీ పరిసరాల్లో స్థానికులను ఖాళీ చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అమ్మోనియం గ్యాస్ పీల్చుకున్న స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడే అపస్మారక స్థితిలోకి జారుకున్నారు. ఇటీవలే ఫ్యాక్టరీకి చేరుకుని పరిస్థితిని కాలుష్య నియంత్ర బోర్డు పరిశీలించి కాలుష్యాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిందిగా సూచించిది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హెచ్చరించిన కొద్ది రోజులకే ఇలాంటి ప్రమాదం జరగడం యాజమాన్యం నిర్లక్ష్యమే అని తెలుస్తోంది.
Recommended Video
పరిస్థితి అదుపులోనే
ఇదిలా ఉంటే ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని సంస్థ యజమాని శ్రీధర్ రెడ్డి చెప్పారు. శుక్రవారం వెల్డింగ్ పనులు జరిగాయని అయితే అది సరిగ్గా జరగకపోవడంతోనే ప్రమాదం జరిగిందని శ్రీధర్ రెడ్డి చెప్పారు. ఇక మృతి చెందిన జీఎం శ్రీనివాస్ కుటుంబంతో మాట్లాడి వారికి పరిహారం చెల్లిస్తామని చెప్పారు. అయితే ఏదో జరిగిపోయిందనే భయాన్ని సృష్టించొద్దని శ్రీధర్ రెడ్డి కోరారు. ప్రభుత్వ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నట్లు శ్రీధర్ రెడ్డి తెలిపారు. అయితే శ్రీనివాస్ మాత్రమే మృతి చెందారని మిగతా వారెవ్వరికీ ఎలాంటి అపాయం కలగలేదని చెప్పారు. ఓ వైపు అమ్మోనియం గ్యాస్ ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతుండగా నీరు కలిపితే ఎలాంటి ప్రమాదం ఉండదని శ్రీదర్ రెడ్డి చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రమాదంపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.