ఏపీ సర్కార్ మరో కీలక మిషన్ .. 'బిల్డ్ ఏపీ ' .. అసలు మ్యాటర్ ఏంటంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక పథకాలకు అంకురార్పణ జరుగుతుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. 'బిల్డ్ ఏపీ' పేరుతో ప్రభుత్వ భూములలో, కొత్త భవనాల నిర్మాణానికి కొత్త మిషన్ను ఏపీ ప్రభుత్వం ప్రారంభించాలని నిర్ణయించింది. నేడు కేబినెట్ భేటీలో బిల్డ్ ఏపీ మిషన్ ఏర్పాటుపై కీలక చర్చ జరగనుందని తెలుస్తుంది.
బిల్డ్ ఏపీ మిషన్ కు శ్రీకారం చుట్టిన వైసీపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం ఎన్బీసీసీ సంస్థతో కలిసి ‘బిల్డ్ ఏపీ' కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. అసలు ఇంతకీ బిల్డ్ ఏపీ మిషన్ ఏంటి అంటే ఏపీలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, అవసరమైన భవన సముదాయాలు నిర్మించడమే బిల్డ్ ఏపీ మిషన్ . ఈ మిషన్లో భాగంగా ప్రభుత్వ భూములను గుర్తించి, భవన సముదాయాలు నిర్మించాలని అంతేకాకుండా మిగతా భూముల్లో మౌలిక వసతులను కల్పించాలని నిర్ణయం తీసుకుంది.
అవసరంలేని ప్రభుత్వ భూములను మార్కెట్ ధరకు విక్రయించాలని నిర్ణయం
ఇప్పటికే ప్రభుత్వ భూములు చాలావరకు అన్యాక్రాంతం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ భూములు పరిరక్షించాలని నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. ఇక అవసరం లేని ప్రభుత్వ భూములను మార్కెట్ ధరకు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు విక్రయించాలని, ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తుంది. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు బిల్డ్ ఏపీ మిషన్లో భాగంగా ప్రభుత్వ భూముల వివరాలు అందజేయాలని జాయింట్ కలెక్టర్ లను ప్రభుత్వం ఆదేశించింది.
ప్రభుత్వ భూముల పరిరక్షణ , భవన నిర్మాణాలే లక్ష్యం
ఇక ఈ బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్ గా ప్రవీణ్ కుమార్ ను నియమించిన ప్రభుత్వం ప్రభుత్వ భూములు వివరాలు సేకరణ, భవనాల నిర్మాణానికి రంగంలోకి దిగనుంది. ఇందుకోసం ప్రభుత్వ భూములు, ఆక్రమణలు, వివాదాల్లో ఉన్న భూముల వివరాలను సేకరించనున్నారు అధికారులు. మొత్తానికి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడటమే కాకుండా అవసరమైన భవనాలను నిర్మించి, అనవసరమైన ఖాళీ స్థలాలను మార్కెట్ ధరకు విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు .
బిల్డ్ ఏపీ మిషన్ సక్సెస్ అవుతుందా ?
ఏపీలో జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పాలనలో ప్రతి విషయంలోనూ ఆయన తనదైన నిర్ణయం తీసుకుంటున్నారు. ఏ చిన్న సమస్యను కూడా పరిష్కరించకుండా వదలటం లేదు. ప్రతీ అంశంపై సునిశితమైన దృష్టి సారిస్తున్న ఆయన ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం కూడా నడుం బిగించారు . ఏపీ సీఎం జగన్ బిల్డ్ ఏపీ మిషన్ ద్వారా ఏం చేయనున్నారు, ఎంత మేరకు తన ఆలోచన సక్సెస్ అవుతుంది అనేది ముందు ముందు తేలనుంది.