దాచేపల్లిలో మరో దారుణం: 13ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ కోఆప్షన్ సభ్యుడు
గుంటూరు: దాచేపల్లిలో మైనర్ బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే అలాంటిదే మరో దారుణం వెలుగుచూసింది. 13ఏళ్ల బాలికపై దాచేపల్లి మండల కోఆప్షన్ సభ్యుడు మహబూబ్ వలీ అత్యాచారానికి పాల్పడ్డాడు.
అంతేగాక, ఈ విషయాన్ని బయటికి చెబితే చంపుతానని ఆ బాలికను బెదిరింపులకు గురిచేశాడు. దీంతో భయపడిపోయిన బాలిక విషయాన్ని ఆలస్యంగా తల్లిదండ్రులకు తెలిపింది. కాగా, బాలిక తల్లదండ్రులు దాచేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం గురజాల ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆమె మూడు నెలల గర్భవతి అని వైద్యులు తెలిపారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఇటీవల దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై 60ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ భారీ ఎత్తున ఆందోళనలు జరగాయి. సీఎం ఆదేశాలతో పోలీసులు నిందితుడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా గాలించారు. కాగా, నిందితుడు చేయకూడని నేరం చేశానంటూ పశ్చాత్తాపంతో ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.