టార్గెట్ గల్లా.. ఎంపీ జయదేవ్ పై మరో నాన్ బెయిలబుల్ కేసు... అరెస్ట్ చేసేందుకు పోలీసుల గాలింపు
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ను టార్గెట్ చేసి మరీ కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు . ఇటీవల బెయిల్ పై విడుదల అయిన తరుణంలో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసి అసలేం జరిగిందో తనను పోలీసులు ఎంతగా చిత్రహింసలు పెట్టారో చెప్పిన గల్లా జయదేవ్ పై తాజాగా మరో నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు . ఇక ఈ నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ నేత, గుంటూరు లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
గిచ్చటం, లాఠీ చార్జ్ చెయ్యటం ..15 గంటలు తిప్పటం... పోలీసుల తీరుపై మండిపడిన గల్లా
అసెంబ్లీ ముట్టడి రోజు గల్లాను అరెస్ట్ చేసి జైలుకు పంపిన పోలీసులు
అసెంబ్లీ ముట్టడి రోజు గల్లాను పోలీసులు అరెస్ట్ చేసి, దాదాపు 15గంటలపాటు గుంటూరు జిల్లా అంతా తిప్పి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి చివరికి గుంటూరు సబ్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే . ఇక అదే రోజు మంగళగిరి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయగా బయటకు వచ్చిన ఎంపీ జయదేవ్ ఎంపీని అని కూడా చూడకుండా తనను చాలా ఇబ్బందులకు గురి చేశారని , తన పరిస్థితే ఇలా ఉంటె సామాన్యుల గతి ఏంటి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు .
గల్లా విధుల్లో ఉన్న పోలీసులపై దౌర్జన్యానికి ప్రేరేపించారని కేసు
అయితే, ముట్టడి సందర్భంగా గల్లా జయదేవ్ మీద ఆయన అనుచరులు చిట్టి బాబు, వినయ్, దామోదర్ చౌదరి తదితరులపై కొంతమంది కానిస్టేబుళ్లు ఇచ్చిన ఫిర్యాదుపై తుళ్లూరు పీఎస్ లో క్రైమ్ నంబర్ 31/2020 నమోదైంది. రెడ్ విత్ 149తో పాటు ఐపీసీలోని 143, 188, 353, 324, 332 తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది. అప్పుడు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ బందోబస్తు విధుల్లో ఉన్న తమపై దౌర్జన్యానికి ప్రేరేపించారని గుంటూరు జిల్లా దుర్గి మండలం ముటుకూరు హెడ్ కానిస్టేబుల్ పెరంబదూరి వేణుగోపాలస్వామి ఫిర్యాదు చేశాడు.
గల్లా అనుచరుల రాళ్ళ దాడితో గాయాల పాలయ్యామని ఫిర్యాదు చేసిన కానిస్టేబుల్
ఇక తాజాగా తమను పక్కకు నెట్టి అసెంబ్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారని, దీంతో అవే సెక్షన్ల కింద క్రైమ్ నంబర్ 31గా రెండో కేసును పెట్టినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆందోళనకారులు గుంపుగా వచ్చి సచివాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన వేళ, వారిని వెనక్కు పంపేందుకు తాము ప్రయత్నిస్తుండగా, రాళ్ళతో దాడి చేశారని, వాటిల్లో ఒకటి తన కుడి కంటి పైభాగంలో తగిలిందని ఏఆర్ కానిస్టేబుల్ గజ్జల హరీశ్ ఫిర్యాదు చేశారు.
గల్లాను అదుపులోకి తీసుకోటానికి గాలిస్తున్న పోలీసులు
గాది లింగం అనే మరో కానిస్టేబుల్ కు నుదుటిపైనా, రాజమండ్రికి చెందిన నాగరాజు, వీరప్పనాయక్ అనే పోలీసులకు ఇతర చోట్ల గాయాలు అయ్యాయని, ఇక్కడి తీవ్రతను గమనించిన ఫోర్స్, తమను రక్షించిందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఆపై తమ విచారణలో గల్లా జయదేవ్ తో పాటు మరికొందరు దాడి చేసినట్టు వెల్లడైందని పేర్కొన్నారు. ఇక ఈ కేసులో జయదేవ్ ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఇదే సమయంలో కావాలనే తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడుతున్నారు టీడీపీ నాయకులు .