విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయవాడ ఫ్లై ఓవర్ నిర్మాణానికి మరో ఆటంకం:సున్నితమైన సమస్య

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

విజయవాడ:నగరవాసుల సౌకర్యార్థం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణానికి మరో ఆటంకం ఎదురైంది. అసలే నిర్మాణం నత్తనడకన సాగుతుందన్న విమర్శలతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి తలబొప్పి కట్టిన సంగతి తెలిసిందే.

ఒక్కో ప్రతిబంధకాన్ని తప్పించుకుంటూ పనులను ముందుకు తీసుకెళుతున్న క్రమంలో తాజాగా ఈ నిర్మాణానికి సంబంధించి మరో సున్నిత సమస్య ఎదురైంది.
ఈ ఫ్లై ఓవర్ నిర్మాణ మార్గంలో రెండు ప్రార్థనా మందిరాలు అడ్డుగా ఉన్నాయి. వాటిని తొలగించేందుకు నిర్వాహకులు ఒప్పుకోకపోవడం, ఈ అంశం భక్తుల మనోభావాలతో ముడి పడి ఉండటంతో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలనే విషయమై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.

హైదరాబాద్‌- చెన్నై జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ కనకదుర్గ దేవాలయం మీదుగా విజయవాడలో చేపట్టిన ఫ్లై ఓవర్ కు ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే...రాష్ట్రంలోనే ఇది తొలిసారిగా 6 లైన్ల ఫ్లై ఓవర్ కావడం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.282 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారుగా 70శాతం పనులు పూర్తయ్యాయి.

Another obstacle to the Vijayawada flyover construction

అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఒక చోట డిజైన్ మార్పు చేయాల్సి రావడం తీవ్ర జాప్యానికి కారణం కాగా దానికి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో ఇక ఫ్లై ఓవర్ నిర్మాణం వేగంగా సాగిపోతుందని భావించారు. ఆ క్రమంలోనే ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫ్లై ఓవర్ ను వచ్చే ఏడాది రిపబ్లిక్ డే నాడు ప్రారంభోత్సవం చేసేయాలని నిర్ణయం కూడా జరిగిపోయింది. అయితే తాజాగా ఎదురైన ప్రార్థనా మందిరాల అవరోధంతో మళ్లీ ఈ కట్టడం పనులకు విఘాతం కలగడమో లేక కట్టడం నిర్మాణంలో స్వల్పంగా మార్పులు చేర్పులు చేయడమో తప్పనిసరి అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు సమస్య సున్నితత్వం దృష్ట్యా, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ సమస్యను అత్యంత సామరస్యంగా పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

ఈ ఫ్లై ఓవర్ నిర్మాణ మార్గంలో ప్రకాశం బ్యారేజీకి సమీపంలో కాలువ రోడ్డు వద్ద రెండు ప్రార్థన మందిరాలు అడ్డుగా ఉన్నాయి. ఫ్లై ఓవర్ 36వ స్తంభం నుంచి 39వ స్తంభం మధ్య ఈ మందిరాలు ఉన్నాయి. ముందయితే వీటిని అక్కడి నుంచి తొలగించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని భావించారు. ఇందుకోసం పలుసార్లు ఆయా మతపెద్దలతో సంప్రదింపులు కూడా జరిపారు. అదే క్రమంలో గత పుష్కరాల సమయంలో ఆ విధంగా పలు మందిరాలను తొలగించారు కూడా. ఆ క్రమంలో ఫ్లై ఓవర్ కు సంబంధించి పిల్లర్ల నిర్మాణం ప్రక్రియ సజావుగా ముగిసింది.

అయితే ఇప్పుడు వాటిపై గడ్డర్లు. స్పైన్లు, వింగ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంది. 16.5 మీటర్ల స్పాన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికే నదిలో ఒకవైపే నిర్మాణం చేసేలా డిజైన్ మార్పుకు అనుమతులు తెచ్చుకోవాల్సి రాగా తాజాగా ఇప్పుడు ఈ ప్రార్థనా మందిరాల వల్ల మరో ఆటంకం ఎదురైంది. ప్రస్తుతం బ్యారేజీ సమీపంలోని అర్జున వీధి వద్ద రెండు ప్రార్థనా మందిరాలు రోడ్డు మధ్యలోనే ఉంటంతో పిల్లర్ల వద్ద స్పాన్లు ఏర్పాటు చేయడం కష్టంగా మారింది. దీనితో వీటి తొలగింపు గురించి కలెక్టర్‌ సమక్షంలో సమావేశం జరగగా విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌లు వాటి తొలగింపునకు అంగీకరించలేదని తెలిసింది.

దీంతో ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్లో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో ఈ రెండు ప్రార్థన మందిరాలను తొలగించకుండానే నిర్మాణం చేస్తామని రహదారులు-భవనాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై దుష్ప్రచారాలను నమ్మవద్దని వారు సూచిస్తున్నారు. అయితే ఆ ప్రార్ధన మందిరాల వద్ద ఉన్న బారికేడ్లు తొలగించి ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత పునర్నిర్మాణం చేస్తామని అధికారులు హామీ ఇస్తున్నారు. దీంతో ఇక్కడ రోడ్డు వెడల్పు తగ్గనుందని తెలిసింది.

English summary
Vijayawada Karakadurga flyover structure is facing another obstacle. There are two prayer halls hindering this bridge at the construction path.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X