సుజయకృష్ణకు మంత్రి పదవి, కేంద్రమంత్రి ఆశోక్ కు చెక్?
విజయనగరం: 2019 ఎన్నికలే లక్ష్యంగా టిడిపి అధినేత చంద్రబాబునాయుడు మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్థీకరించారు.అయితే విజయనగరం జిల్లాలో కేంద్ర మంత్రి ఆశోక్ గజపతి రాజు వైరి వర్గంగా ఉన్న బొబ్బిలి రాజు సుజయ కృష్ణ రంగారావు మంత్రిపదవిని కట్టబెట్టారు చంద్రబాబునాయుడు.
మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ విషయమై పార్టీ నాయకుల నుండి అసంతృప్తులు నిరసనలు వ్యక్తమైనా చంద్రబాబునాయుడు పట్టించుకోలేదు. ఈ విషయమై పార్టీ నాయకులపై ఒకింత సీరియస్ గానే హెచ్చరించారు.
2019 ఎన్నికలే లక్ష్యంగా బాబు మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్థీకరించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని పార్టీ నాయకులు కొందరు చెబుతున్నారు.అయితే ఇప్పటివరకు విజయనగరం జిల్లాలో కేంద్ర మంత్రి ఆశోక్ గజపతి రాజును కాదని పార్టీ కార్యకలాపాలను బాబు చేపట్టలేదు.
కాని, పార్టీ అవసరాల రీత్యా బొబ్బిలి రాజు సుజయకృష్ణ రంగారావును చంద్రబాబునాయుడు పార్టీలోకి ఆహ్వనించారు.అయితే ఆ సమయంలో కూడ ఆశోక్ గజపతి రాజు పార్టీ ప్రయోజనాల కోసమని ఈ విషయంలో మౌనంగానే ఉన్నారు.
టిడిపి విజయనగరం జిల్లాలో బొబ్బిలిరాజు మరో పవర్ సెంటర్?
టిడిపి విజయనగరం జిల్లాలో కేంద్ర మంత్రి ఆశోక్ గజపతి రాజు కనుసన్నల్లోనే పార్టీ కార్యక్రమాలు సాగేవి. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడ ఈ విషయమై ఆయనను సంప్రదించిన తర్వాతే నిర్ణయాలు తీసుకొనేవారు. అయితే ఆశోక్ గజపతి రాజు కుటుంబానికి బొబ్బిలి రాజు కుటుంబానికి మధ్య ఆది నుండి విబేధాలున్నాయి.అయితే వైసీపీ నాయకత్వం పట్ల అసంృప్తిగా ఉన్న బొబ్బిలిరాజు సుజయ కృష్ణ రంగారావును టిడిపిలో చేర్చుకొన్నారు. సుజయ కృష్ణరంగారావును పార్టీలో చేర్చుకోవడమే కాదు ఆయనను రాష్ట్ర మంత్రివర్గంలోకి కూడ తీసుకొన్నారు చంద్రబాబునాయుడు. దీంతో విజయనగరం జిల్లా పార్టీలో సుజయ కృష్ణ రంగారావు మరో పవర్ సెంటర్ గా మారే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
బంగ్లా రాజకీయాలకు బ్రేక్ పడ్డాయా?
టిడిపి విజయనగరం జిల్లాలో ఆశోక్ గజపతి రాజు హవాకు బ్రేక్ పడిందా అనే చర్చ సాగుతోంది. సుజయ కృష్ణరంగారావును పార్టీలో చేర్చుకోవడంతో పాటు మంత్రి పదవిని కూడ కట్టబెట్టడం పట్ల ఆయన అనుచరులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.ఈ జిల్లాలో బంగ్లా రాజకీయాలకు బ్రేక్ పడినట్టేనా అనే చర్చ సాగుతోంది.
కళా వెంకట్రావు డైరెక్షన్ లోనే
టిడిపి ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ కళా వెంకట్రావు డైరెక్షన్ లోనే విజయనగరం జిల్లాలో మార్పులు చేర్పులకు చంద్రబాబు శ్రీకారం చుట్టారని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. విజయనగరం జిల్లా నుండి మృణాళిని మంత్రివర్గంలో కొనసాగినా ఆమె ఆశోక్ అడుగుజాడల్లోనే కొనసాగారు. అయితే సుజయకృష్ణ రంగారావు మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో మృణాళిని పట్టు కోల్పోయే అవకాశం లేకపోలేదు.
శత్రుచర్లకు పదవికి కారణమిదే
కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పదవులు అనుభవించిన మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజును పార్టీలోకి తీసుకురావడంతో పాటు ఇటీవల ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడం కూడ విజయనగరం జిల్లాకు చెందిన పార్టీ నాయకులకు ఇష్టం లేదు.అయితే పార్టీ అవసరాల రీత్యా శత్రుచర్లకు ఎమ్మెల్సీ పదవిఇవ్వాల్సి వచ్చిందని చంద్రబాబునాయుడు పార్టీ నాయకులకు వివరించారు.
బీసీ జపం కూడ బాబు వద్ద పనిచేయలేదు
సుజయ కృష్ణ రంగారావుకు మంత్రిపదవి ఇవ్వకుండా బీసీల్లో ఇతరులకు ఎవరికైనా మంత్రిపదవి ఇస్తే సరిపోతోందని వైరివర్గీయులు చేసిన సూచనను బాబు పట్టించుకోలేదు.తన వాదనను వ్యతిరేకించే నాయకులకు పార్టీ అవసరాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకొంటున్నట్టు బాబు చెబుతున్నారు.