గుంటూరులో మరో దారుణం: మైనర్ బాలికపై యువకుడి రేప్ యత్నం..
గుంటూరు: గుంటూరులో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికపై యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. నిందితుడిని రాజాసింగ్ గా గుర్తించారు. విషయం తెలిసిన స్థానికులు అతన్ని ఉరితీయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. రాజీవ్ గృహకల్ప సముదాయంలో నివాసం ఉండే రాజాసింగ్ అనే యువకుడు స్థానిక బేకరీలో పనిచేస్తున్నాడు. మంగళవారం బేకరీలో పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంటి ఎదుట ఆడుకుంటున్న ఓ పదేళ్ల చిన్నారిని తనతో పాటు ఇంట్లోకి తీసుకెళ్లాడు.
ఇంట్లో బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడటంతో ఆ చిన్నారి గట్టిగా కేకలు పెట్టింది. దీంతో గమనించిన స్థానికులు రాజాసింగ్ని పట్టుకుని దేహశుద్ది చేశారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు. నిందితుడుని వెంటనే ఉరి తీయాలంటూ బాలిక బంధువులు పెద్ద ఎత్తున పాత గుంటూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది.