బాలినేని వర్సెస్ వైవీ: జగన్ను వీడటం వెనుక మరో కారణం, సుజయదీ అదే..
ఒంగోలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి.. పార్టీలోని స్థానిక నేతల మధ్య తగాదాలను పరిష్కరించే విషయంలో అలక్ష్యం చూపిస్తున్నారా? అందుకే పార్టీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు బయటకు వెళ్తున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
గత కొద్ది రోజులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పదకొండు మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ రోజు (బుధవారం నాడు) బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు, ఆయన తమ్ముడు తదితరులు సైకిల్ ఎక్కనున్నారు. సుజయ సైకిల్ ఎక్కడానికి ప్రధాన కారణం... బొత్స సత్యనారాయణ చేరిక, ఆయనకు జగన్ ప్రాధాన్యత ఇవ్వడమేననే వాదనలు ఉన్నాయి.
ఏ పార్టీలో అయినా, ఎక్కడైనా పార్టీలో అంతర్గత సమస్యలు ఉంటాయి. పార్టీలో కూడా నేతల మధ్య ఆధిపత్య పోరు ఉంటుంది. అలాగే వైసిపిలోను ఉంది. అయితే, వైసిపిలోని స్థానిక నేతల మధ్య పోరు విషయంలో జగన్ అంతగా కల్పించుకోవడం వాదనలు వినిపిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ మంత్రంతో పాటు వైసిపిలోని అంతర్గత కలహాలు, కొన్ని వైఫల్యాల కారణంగా నేతలు పార్టీని వీడుతున్నారని చెబుతున్నారు. పార్టీ నుంచి నేతలు వెళ్లిపోతున్నప్పటికీ జగన్ అంతగా పట్టించుకోలేదని నిన్నటి దాకా వినిపించాయి. ఆ తర్వాత ఆయన అప్రమత్తమయ్యారు.
అయితే, జగన్ విషయంలో తాజాగా మరో వాదన వినిపిస్తోంది. లోకల్ నాయకుల్లో విభేదాలు వచ్చినప్పుడు జగన్ కల్పించుకొని సరిదిద్దే ప్రయత్నాలు చేయడంలో అంత ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. అందుకు ప్రకాశం జిల్లాలో మామాఅల్లుళ్ల మధ్య వచ్చిన గొడవనే నిదర్శనమని అంటున్నారు.
దానిని జగన్ పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదంటున్నారు. ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ వీడుతారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆయన మంగళవారం బయటకు వచ్చి.. పార్టీలో కొన్ని ఇబ్బందికర పరిణామాలు నిజమేనని, కానీ తాను పార్టీని వీడటం లేదని స్పష్టం చేశారు.
తనకు తన మామ వైవీ సుబ్బారెడ్డితో విభేదాలు ఉన్నాయని ఆయన చెప్పారు. వైవీతో విభేదాలు నిజమేనని, తమ పార్టీ అధినేత జగన్ వాటిని పరిష్కరిస్తాడని తాను నమ్ముతున్నానని వ్యాఖ్యానించారు. జగన్ వాటిని పరిష్కరిస్తాడని నమ్ముతున్నానని చెప్పడమే ఇక్కడ పాయింట్ అంటున్నారు.
అంటే, ఇంతకాలం బాలినేని, వైవీల మధ్య విభేదాలను జగన్ పట్టించుకోనట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. అందుకే బాలినేని విషయంలో పార్టీ వీడుతారనే ప్రచారం జరిగి ఉంటుందని చెబుతున్నారు. బాలినేని, వైవీల మధ్య విభేదాల పరిష్కారం విషయంలో జగన్ ఆసక్తి చూపించనట్లే మిగతా వారి విషయంలోను వ్యవహరించి ఉంటారంటున్నారు.
విజయనగరంలో, బొత్స సత్యనారాయణ పార్టీలో చేరినప్పుడే సుజయ కృష్ణ రంగారావు అసంతృప్తిని వ్యక్తం చేశారు. అప్పటికి సుజయను బుజ్జగించారు. ఆ తర్వాత బొత్సకు పార్టీలో క్రమంగా ప్రాధాన్యత పెరుగుతుండటం, దానిని సుజయ జీర్ణించుకోకపోవడం జరిగిందని అంటున్నారు. అయితే, సుజయ అసంతృప్తిని గుర్తించినట్లుగా కనిపించడం లేదని, అలాగే వారిద్దరు మధ్య విభేదాలను పరిష్కరించే ప్రయత్నం చేసినట్లుగా కనిపించలేదని అంటున్నారు.