రివర్స్ లో వెళ్ళినా లాభమే అంటున్న ఏపీ సర్కార్ .... సక్సెస్ అయిన మరో రివర్స్ టెండరింగ్
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆపరేషన్ రివర్స్ అంటోంది. రివర్స్ టెండరింగ్ తో ఆదా చేయవచ్చని పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో ఏపీ సర్కార్ చేసి చూపించింది. ఇక తాజాగా మరొక విషయంలోనూ ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్తో డబ్బు ఆదా చేసింది.
ఏపీలో కొత్త బార్లకు ఐదురోజులైనా దరఖాస్తులు నిల్.... రీజన్ ఇదే
రివర్స్ టెండరింగ్ తో మరోమారు ఏపీ సర్కార్ సక్సెస్
ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వివిధ పనుల విషయంలో రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షం నుండి ఎంత వ్యతిరేకత వ్యక్తం అయినప్పటికీ పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్ కు వెళ్లి జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా ఇప్పటికే కోట్ల రూపాయలను ఆదా చేసి చూపించిన ఏపీ ప్రభుత్వం పోలవరం, వెలిగొండతో పాటూ మరికొన్ని పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్తో సాధించింది.
స్మార్ట్ ఫోన్ ల కొనుగోలుకు రివర్స్ టెండరింగ్
ఇక ఈసారి స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంలోనూ సక్సెస్ అయింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు వాలంటీర్ల కోసం 2,64,920 స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా 83.8 కోట్ల ప్రజాధనం ఆదా చేసినట్టుగా పేర్కొంది.
టెండర్ వేసిన సంస్థే తగ్గించి మరోమారు రివర్స్ టెండర్
స్మార్ట్ ఫోన్ల కొనుగోలు వ్యవహారంలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్(ఏపీటీఎస్) పలు కంపెనీలను టెండర్లకు పిలిచింది. మొదట నవంబర్ 30న తొలిదశ బిడ్డింగ్ తీశారు. ఎల్-1 సంస్థ రూ. 317.61 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. తర్వాత ఎల్-1 ధరపై ఏపీటీఎస్ రివర్స్ టెండరింగ్లో బహిరంగ వేలం నిర్వహించింది. దీంతోఈ టెండరింగ్లో అదే ఎల్-1 సంస్థ రూ. 233.81 కోట్లకు కోడ్ చేసి ఈ బిడ్ను దక్కించుకుంది. ఎల్-1 కంపెనీ తొలిదశ బిడ్డింగ్తో పోలీస్తే రూ. 83.8 కోట్ల తక్కువకు కోడ్ చేసింది. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.83.8కోట్ల ప్రజాధనం ఆదా చేశామని ప్రభుత్వం చెబుతోంది.
గ్రామ వాలంటీర్ల స్మార్ట్ వర్క్ కోసమే మొబైల్స్
గ్రామ,వార్డు వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించిన సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లకు స్మార్ట్ ఫోన్ అందించాలని నిర్ణయం తీసుకుని ఈ రివర్స్ టెండరింగ్ నిర్వహించింది. ఏపీ ప్రభుత్వం వాలంటీర్స్కు ఇచ్చే స్మార్ట్ ఫోన్లకు ఓ ఏడాది పాటు వారెంటీ, 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ, ఆక్టాకోర్ ప్రాసెసర్ వంటి ఫీచర్స్ ఉండటంతోపాటు మూడేళ్లపాటు మాస్టర్ డేటా మేనేజ్మెంట్, టైప్ సి , మైక్రో యూఎస్బీ టూ మైక్రో యూఎస్బీ కన్వెర్టర్, టాంపర్డ్ గ్లాస్, బ్యాక్ కవర్, మూడేళ్ల వరకు మెయింటినెన్స్ వాకిన్ సపోర్ట్ను కంపెనీ అందించనుంది. తద్వారా గ్రామస్థాయిలో వాలంటీర్లు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని స్మార్ట్ వర్క్ చేయడానికి వీలవుతుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.