మరో వివాదంలో టీటీడీ- సప్తగిరి మాసపత్రికలో రామాయణం వక్రీకరణ ? బీజేపీ గరంగరం...
తిరుమల, తిరుపతి దేవస్ధానం మరో వివాదంలో చిక్కుకుంది. లాక్ డౌన్ కారణంగా దర్శనాలు నిలిచిపోయి అసలే కష్టాల్లో ఉన్న సమయంలో టీటీడీకి చెందిన సప్తగిరి మాసపత్రికలో ప్రచురితమైన ఓ వ్యాసమే ఇందుకు కారణం. ఈ వ్యాసంలో సీతకు ఒక్కడే కుమారుడు లవుడని, కుశుడు దర్భతో చేసిన బొమ్మ అంటూ టీటీడీ ప్రచురించింది. మాసపత్రికలోని ఓ జానపద కథలో ఇది ప్రచురితమైంది. దీనిపై ఇప్పుడు కొత్తగా వివాదం మొదలైంది.
ఈ కథను తిరుపతికి చెందిన తొమ్మిదో తరగతి బాలుడు పునీత్ రాయగా.. టీటీడీ తన మాసపత్రిక సప్తగిరిలో ప్రచురించింది. టీటీడీ వంటి ధార్మిక సంస్ద వాల్మీకి రామాయణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా జానపథ కథల ద్వారా దాన్ని వక్రీకరిస్తోందని బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు.
జానపదాల్లో రకరకాల ప్రచారాలపై ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రామాయణాన్ని తప్పుదారి పట్టించినట్లు అవుతుందని వారు తెలిపారు. మరోవైపు రామాయణాన్ని వక్రీకరిస్తూ టీటీడీ మానసపత్రికలో కథనంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.