సంక్రాంతి పోయి సంక్రాంతి వచ్చె- ఏపీలో తేలని రాజధానులు, ఎన్నికలు- క్యాలెండర్ మారినా
ఏపీలో దాదాపు రెండేళ్ల క్రితం కొలువుదీరిన వైసీపీ సర్కారు గతేడాది సంక్రాంతి సీజన్లో నెత్తికెత్తుకున్న రెండు కీలక అంశాల్లో ముందడుగు వేయడంలో ఇప్పటికీ విఫలమవుతూనే ఉంది. రాజ్యాంగంలో ఇచ్చిన వెసులుబాట్ల మేరకే ఈ రెండు అంశాల్లో అడుగులు వేశామని చెప్పుకుంటున్నా భారీ మెజారిటీ ఉన్న ప్రభుత్వం వీటి విషయంలో ఎందుకు ముందుకెళ్లలేని పరిస్ధితి తలెత్తిందనే ప్రశ్న తరచుగా వినిపిస్తోంది. సరైన హోమ్వర్క్, పక్కా వ్యూహంతో పూర్తి చేసే అవకాశం ఉన్న రాజధాని, స్ధానిక ఎన్నికల విషయంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలకు ఈ సంక్రాంతి సీజన్ ఆనవాలుగా నిలుస్తోంది.
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోతుల సునీత-బీఫారం ఇచ్చిన సీఎం జగన్- కొత్త రాజకీయం
ఏపీలో రాజధానులు, ఎన్నికలు
ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు రాజధానుల ఏర్పాటు, దీంతో ఎలాంటి సంబంధం లేని స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ. ఈ రెండు అంశాలు ఒకదానితో ఒకటి ఏ విధంగానూ పొంతన లేనివి. వీటిని గతేడాది సంక్రాంతి సీజన్లో నెత్తికెత్తుకున్న వైసీపీ సర్కారు కేవలం రెండు, మూడు నెలల వ్యవధిలోనే పూర్తి చేయగలమన్న ధీమా ప్రదర్శించింది. సరైన హోమ్వర్క్ లేకుండానే రాజధానుల ఏర్పాటుతో పాటు స్ధానిక పోరుకు సిద్ధమైన వైసీపీ సర్కారు అధికార బలంతో రాజధానుల్ని, అసెంబ్లీ ఎన్నికల గెలుపు మత్తును స్ధానిక ఎన్నికలకు లింక్ చేసుకుని తాము ఆశించినట్లుగానే ఈ రెండు వ్యవహారాలూ సజావుగా పూర్తవుతాయని ఆశించింది.
లోపభూయిష్టంగా రాజధానుల ప్రక్రియ
రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వం ఎంచుకున్న మార్గం కార్యనిర్వాహక, శాసన వ్యవస్ధల ఆమోదం మాత్రమే. ఈ రెండు వ్యవస్ధలూ తమ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి అవి ఆమోదిస్తే చాలు రాజధానుల ఏర్పాటు పూర్తయిపోతుందని భావించింది. కానీ రాజధానిగా అమరావతి ఏర్పాటు కోసం జరిగిన అవే కార్యనిర్వాహక, శాసన ప్రక్రియను తాము ఛాలెంజ్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను విస్మరించింది. దీంతో ప్రభుత్వం, అసెంబ్లీ, గవర్నర్ ఆమోదించిన బిల్లులు హైకోర్టులో పెండింగ్లో పడ్డాయి. న్యాయప్రక్రియలో వివిధ కారణాలతో చోటు చేసుకుంటున్న అపరిమిత జాప్యం ఇప్పుడు రాజధానుల వ్యవహారం ఎప్పుడు తేలుతుందో తెలియని పరిస్ధితికి నెట్టేశాయి. దీంతో ప్రభుత్వ పెద్దలు మూడు నెలల్లో, నాలుగు నెలల్లో రాజధాని తరలిస్తామని చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నారు.
చేజేతులా స్ధానిక ఎన్నికల జాప్యం
ఏపీలో గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు స్ధానిక సంస్ధల ఎన్నికల విషయంలో న్యాయపరమైన చిక్కుల గురించి ఎక్కువగా ఆలోచించేవి. కానీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం న్యాయప్రక్రియ కంటే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి ఎక్కువగా ఆలోచిస్తోంది. దీనికి కారణం గతేడాది ఎన్నికల వాయిదా అనంతరం నిమ్మగడ్డపై కులం పేరుతో చేసిన ఎదురుదాడే. నిమ్మగడ్డ కూడా దీన్ని సీరియస్గా తీసుకోవడంతో ఎక్కడ తమ పుట్టి మునుగుతుందో అన్న భయంతో ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా అడ్డంకులు కల్పిస్తూనే ఉన్నారు. నిమ్మగడ్డ పదవీకాలం మార్చిలో ముగియనుండటంతో ఆ తర్వాతే దీనికో పరిష్కారం లభించే అవకాశముంది.
వైసీపీ సర్కారు సమర్ధతపై అనుమానాలు
వైసీపీ ప్రభుత్వం గతేడాది ప్రారంభించిన రెండు కీలక అంశాలు రాజధానులు, ఎన్నికల విషయంలో ముందడుగు వేయలేకపోతోంది. అదే సమయంలో జిల్లాల విభజన, భూముల సర్వేను కూడా నెత్తికెత్తుకుంది. ఈ నాలుగు అంశాలనూ ఒకేసారి ముందుకు నడిపించే ప్రక్రియలో సమన్వయం అస్సలు కుదరడం లేదు. దీంతో తాజాగా భూముల సర్వే తర్వాతే జిల్లాల విభజన చేయాలని భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఓవైపు రాజధానులు, ఎన్నికల వ్యవహారాలు పెండింగ్లో ఉండగా.. భూముల సర్వే, జిల్లాల విభజన ప్రక్రియ ద్వారా మరిన్ని కొత్త వివాదాలను సర్కారు రాజేస్తోంది. స్ధూలంగా వీటిని గమనిస్తున్న విశ్లేషకులకే కాదు సాధారణ ప్రజలకూ కూడా వైసీపీ ప్రభుత్వ సమర్ధతపై అనుమానాలు బలపడుతున్నాయి.