ఖజానాకే కన్నం వేసిన మరో ప్రభుత్వ ఉద్యోగి...రూ. 2 కోట్లు స్వాహా:ఇలా ఎక్కడెక్కడ ఎవరెవరు చేస్తున్నారో?
విశాఖపట్నం:కంచే చేను మేసిన చందంగా విశాఖపట్టణంలోని సీతమ్మ ధార సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఇంటిదొంగలు పడ్డారు. ఏమాత్రం భయం లేకుండా ఏకంగా కోట్ల రూపాయాలు స్వాహా చేసేశారు. తొలుత సీనియర్ ఉద్యోగి ఈ స్కామ్ చేయగా...ఇటీవలే ఉద్యోగంలో చేరిన మరో జూనియర్ కూడా ఇదే బాటపట్టాడు.
మరోవైపు ఇలాంటి అక్రమాల నిరోధానికే టెక్నాలజీ ఉపయోగపడుతుందంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన సీఎఫ్ఎంఎస్ విధానం కూడా ఈ ఇంటి దొంగ సంగతి ఏమాత్రం పసిగట్టలేకపోయింది. అయితే ఇలా కుంభకోణానికి పాల్పడటం ఒక్కడి వల్లా కాదని...ఇతడికి ఇతర ఉద్యోగుల సహకారం కూడా ఉండే ఉటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.
విశాఖపట్టణం సీతమ్మధారలో ఉండే ప్రభుత్వ ఉప ఖజానా కార్యాలయంలో ఇంటిదొంగల అక్రమాల లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వెంకట నరసింహారావు అనే ఉద్యోగి ట్రెజరీ సొమ్మును తన తల్లి వరలక్ష్మి పింఛను ఖాతాకు తరలించిన వ్యవహారం వెలుగులోకి రావడం దిగ్భ్రాంతి కలిగించింది. ఇలా ఇతడు అక్రమంగా తరలించిన సొమ్ము ఎంతో తెలుసా?...ఏకంగా రూ.2 కోట్ల రూపాయలు.
ట్రెజరీలో స్కామ్ పై ఏదో లక్షల్లో స్వాహా జరిగి ఉంటుందని భావించిన అధికారులు ఏకంగా కోట్ల రూపాయల్లో కుంభకోణం గురించి తెలిసి విస్తుపోయారు. ఈ క్రమంలో దీనిపై విచారణ జరుపుతున్న త్రిసభ్య కమిటీ, ఈ ట్రెజరీ స్కామ్ పై మరింత లోతుగా విచారణ జరపాలని నిర్ణయించిందని సమాచారం. ఇదిలావుంటే ఇటీవలే అమలులోకి వచ్చిన లేటెస్ట్ సీఎఫ్ఎంఎస్ చెల్లింపుల విధానంలో ఇలాంటి అక్రమాలకు తావుండదని ప్రభుత్వం ఊదరగొట్టగా...వాస్తవంలో ఈ అక్రమాలను పసిగట్ట లేకపోవడం ఇందులో డొల్లతనాన్ని బైటపెడుతోంది.
మరోవైపు ఈ విధానంలో డబ్బు విత్ డ్రాకు అవసరమైన ఉన్నతాధికారుల 'పాస్ ఆర్డర్' లేకుండా సొంత ఖాతాలకు సొమ్ములను ఎలా దారి మళ్లించారో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇక ఈ కుంభకోణానికి పాల్పడిన జూనియర్ అసిస్టెంట్ వెంకట నరసింహారావు అక్రమాల వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు వచ్చిన విచారణ అధికారులు మరో జూనియర్ అసిస్టెంట్ కూడా ఇలాగే తన సొంత ఖాతాకు రూ.50 లక్షలకు పైగా మళ్లించినట్టు గుర్తించి ఖంగు తిన్నారు. ఇతడు కారుణ్య నియామకం కింద కిందటి ఏడాదే ఇక్కడ ఉద్యోగంలో చేరడం గమనార్హం.
అయితే ఈ అక్రమాల వ్యవహారంలో కీలక స్థానాల్లో ఉన్న కొందరు ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాంటి సహకారం లేకుండా ఇంత పెద్ద స్కామ్ సాధ్యం కాదనేది వారి అంచనా. చనిపోయిన పెన్షన్దారుల ఖాతాలకు గతంలో రూ.8 కోట్లు మళ్లించిన వ్యవహారంపై విజిలెన్స్ నివేదిక అనంతరం ఇక్కడ అన్ని విభాగాల సిబ్బందిని బదిలీ చేయాలని ప్రభుత్వ ఆదేశించింది. దీంతో గత ఏడాది డిసెంబరులో బదిలీల ప్రక్రియ చేపట్టిన అధికారులు నిందితుడు వెంకట నరసింహారావును వదిలేసి, మిగిలిన వారిని బదిలీ చేయడం...ఈ క్రమంలో అతడు ఈ స్కామ్ కు పాల్పడటంతో ఉన్నతాధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.