రాజధాని భూ కేటాయింపుల్లో వెలుగు చూసిన మరో అక్రమం:భూమి లేనివ వ్యక్తికి ప్లాట్ల కేటాయింపు
అమరావతి:నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం సందర్భంగా చోటుచేసుకుంటున్న కొన్ని అక్రమాలు స్థానిక రైతుల గుండెలు రగిలిపోయేలా చేస్తున్నాయి.
తాము ఎంతో త్యాగపూరితంగా జీవనాధారం అయిన భూములను రాజధాని కోసం ఇస్తే కొందరు ఏ భూములు ఇవ్వకుండానే ఇచ్చినట్లు రికార్డ్ లు ట్యాంపర్ చేసి అక్రమంగా ప్రభుత్వం నుంచి విలువైన ప్లాట్లు పొందుతున్నారని ఇక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారపార్టీనేత అండదండలు, అధికారుల తోడ్పాటునే ఇటువంటి అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని వారు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే...
అతడి పేరు బేతపూడి సురేష్బాబు...ఊరు గుంటూరు జిల్లా నవ్యాంధ్ర రాజధాని పరిధిలోని మందడం గ్రామం. ఇతడికి సిఆర్డీఏ అధికారులు 27-797-3779-3-బి1, 27-797-3779- 23- బి1 నంబర్లలో 250 గజాల నివాస స్థలం, 24-762-3766- 39- సి2 నంబర్లో 500 గజాల విల్లా, 24-764-3777- 19- ఐ2 నంబర్లో 250 గజాల కమర్షియల్ ప్లాట్లను కేటాయించారు. అంతేకాదు నాలుగేళ్లుగా అతడికి కౌలు చెక్కులు చెల్లిస్తున్నారు.
ఇతడికి ఇవన్నీ ఎందుకు ఇచ్చారంటే ఇతడు తన ఎకరం భూమిని రాజధాని నిర్మాణం కోసం ఇచ్చేసినందుకు గాను...అందుకు ప్రతిగా సిఆర్డీఏ ఈ ప్లాట్ల కేటాయింపు జరిపింది...ఇందులో తప్పు కాని...వింత గాని ఏముందంటారా?...అయితే అసలు విషయం ఏమిటంటే...అసలు ఇతడికి రాజధాని పరిధిలో భూమే లేదు. అయినా సరే మరి సిఆర్డీఏ అధికారులు ఇతడు తమకు భూమి ఇచ్చినట్లుగానే నిర్ణయించేసుకొని అతడికి ఆ ప్లాట్ల బెనిఫిట్లు కల్పించారు.
బేతపూడి సురేష్బాబు అనే ఈ వ్యక్తి ల్యాండ్ పూలింగ్లో భాగంగా మంగళగిరి మండలం కురగల్లు గ్రామంలో తనకు ఎకరం భూమి లేకపోయినా ఉందని పేర్కొంటూ, ఎకరం భూమిని సీఆర్డీఏకు ఇస్తున్నట్లు అంగీకారపత్రం అందజేశారు. అయితే వాస్తవంగా భూములు తీసుకునే సమయంలో సీఆర్డీఏ అధికారులు రైతుల నుంచి తప్పనిసరిగా 9.14 కింద అగ్రిమెంట్ చేసుకుంటారు. ఆ తరువాత రైతుకు సంబంధించిన భూ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, సర్వే చేసిన అనంతరం అవి నిజమని నిర్ధారించుకున్న తర్వాత 9.18ఏ కింద ప్లాట్లను ఎంచుకోవాలని సంబంధిత రైతులకు సూచిస్తారు.
అనంతరం సదరు రైతుకు పరిహారం కింద వచ్చే ప్లాట్లను కేటాయిస్తారు. ఇక్కడ సురేష్ బాబుతో 9.14 అగ్రిమెంట్ చేయించుకోకుండానే అధికారులు అతనికి ప్లాట్లు కేటాయించారు. భూమి సర్వే చేయకుండానే అఫిడవిట్ ఆధారంగా ప్లాట్లు కేటాయించడం వెనక అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఇలాంటి సంఘటనే ఒకటి జరుగగా ఆ ఉదంతం రాష్ట్రావ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
మందడం గ్రామ రెవెన్యూ పరిధిలో 207/1లో ఎకరం 70 సెంట్ల భూమి కృష్ణా నదిలో కలిసిపోగా ఈ సర్వే నంబర్లో గుంటూరు జిల్లాకు చెందిన పఠాన్ గౌస్కు భూమి ఉందని సీఆర్డీఏ అధికారులే డాక్యుమెంట్లు పుట్టించారు. ఆ ప్రకారం అతడికి అసలు భూమి లేకుండానే అతనికి 1,450 గజాల ప్లాట్లు కేటాయించారు. అందులో 250 గజాల ప్లాట్ను కూడా నిందితుడు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. రెండో ప్లాట్ను విక్రయించే సమయంలో కొనుగోలుదారులకు అనుమానం వచ్చి డాక్యుమెంట్లను పరిశీలించగా పత్రాలన్నీ నకిలీవని తేలింది. ఈ ఘటనలో ప్రధాన నిందితులను ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడం గమనార్హం.