మరో పథకంతో ఏపీలో కేసీఆర్ బాటలో జగన్ .. పాత పథకం కొత్త బిల్డప్ అన్న లోకేష్
ఏపీలో మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఏపీ సీఎం జగన్ . తెలంగాణ సీఎం కేసీఆర్ బాటలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఇప్పటికే కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించగా తాజాగా జగన్ అక్టోబర్ నెల నుండి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది టీడీపీ హయాంలో అమలవుతున్న పథకం అని నారా లోకేష్ మండిపడ్డారు.
జగన్ సర్కార్ నిర్ణయం 'వైఎస్ఆర్ కంటి వెలుగు' పేరుతో కొత్త పథకం
ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు నవరత్నాల అమలుపై ఫోకస్ పెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నవరత్నాల అమలుకోసం అసెంబ్లీలో పలు కీలక బిల్లును ఆమోదింపజేసింది. ఇక అందులో భాగంగా మరో కొత్త పథకాన్ని తీసుకువచ్చేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం అవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాలన్న ఉద్దేశంతో.. 'వైఎస్ఆర్ కంటి వెలుగు' పేరుతో కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు .
అక్టోబరు 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వైఎస్సార్ కంటి వెలుగు
అక్టోబరు 10వ తేదీ నుంచి వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ప్రారంభం కానుంది. వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.తెలంగాణా సీఎం కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కంటి వెలుగు పథకం పేరుతో పేదలకు ఉచితంగా కళ్ల పరీక్షలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్టు లో ఏపీ కూడా చేరుతోంది. ఇప్పటికే చాలా విషయాల్లో కేసీఆర్ ను అనుసరిస్తున్న ఏపీ సీఎం జగన్ ఈ నిర్ణయంతో తెలంగాణా సీఎం కేసీఆర్ బాటలో నడుస్తున్నారన్న భావన కలుగుతుంది.
చంద్రబాబు హయాంలో 'ముఖ్యమంత్రి ఇ-ఐ కేంద్రాలు' .. పేరు మార్చి వైసీపీ డ్రామాలు అన్న నారా లోకేష్
ఇక ఈ పథకం టీడీపీ హయాంలో అమలు జరిగిందని, దాని పేరు మార్చి ప్రజలను జగన్ మభ్యపెడుతున్నారని లోకేష్ విమర్శలు గుప్పించారు. ప్రజలను ఎలా మభ్యపెడతారు అనేదానికి ఇదొక ఉదాహరణ అంటూ లోకేష్ నిప్పులు చెరిగారు. గతంలో సీఎం చంద్రబాబు 'ముఖ్యమంత్రి ఇ-ఐ కేంద్రాలు' నెలకొల్పి పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు చేసే కార్యక్రమం ప్రారంభించారు. ఇప్పటికే ఆ కేంద్రాల సేవలను 10.80 లక్షల మంది వినియోగించుకున్నారు. ఇక ఇదే పథకం పేరు మార్చి ఏదో తాము కొత్తగా ప్రవేశపెట్టిన పథకం అని చెప్పుకోవటం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఇక నాటి పేపర్ క్లిప్పింగ్స్ ను కూడా తనపోస్ట్ కు జత చేసి పెట్టారు లోకేష్ .
అది టీడీపీ అమలు చేసిన స్కీమ్ నే ..బిల్డప్ ఇవ్వటం ఆపండి అంటూ ఫైర్ అయిన నారా లోకేష్
ఇక అంతే కాదు గత ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి డబ్బా కొట్టుకోవటం ఆపండి అంటూ విమర్శించారు లోకేష్ . చంద్రబాబు హయాంలోనే ఈ పథకం ఉందనే ఈ విషయం స్వయంగా జగన్ గారి ప్రభుత్వంలో ఉన్న 'ఆరోగ్య ఆంధ్ర'నే చెప్తోంది. ఆ పధకాన్నే పేరు మార్చి, కొత్త పధకం అంటూ జగన్ గారి ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటోంది. కొత్త నిర్ణయం అంటూ ప్రజలను మభ్య పెడుతోంది. జగన్ గారూ! ఇప్పటికే ఉన్న పధకాలపై బిల్డప్ ఇవ్వకుండా, తమరి నవరత్నాల సంగతి చూడండి. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మొత్తానికి కంటి వెలుగు కార్యక్రమం గతంలోనూ అమలులో ఉందని లోకేష్ చెప్తుంటే , జగన్ అందించే కొత్త పథకం అని వైసీపీ చెప్తుంది. ఇక తెలంగాణా నేతలు ఇది కేసీఆర్ పెట్టిన స్కీమ్ అని చెప్పుకుంటున్నారు.