మరో సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ ..అర్బన్ హౌసింగ్ స్కీమ్ పై సీఎం నజర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్బన్ హౌసింగ్ ప్లాట్స్ నిర్మాణంపై రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఇళ్లు లేకుండా ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గృహ నిర్మాణ శాఖపై సీఎం సమీక్ష జరిపిన ఆయన గృహ నిర్మాణాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అర్బన్ హౌసింగ్లో ఫ్లాట్ల నిర్మాణాలపై రివర్స్ టెండరింగ్కు వెళ్లాలని అధికారులను ఆదేశించిన సీఎం జగన్
ఇక గృహ నిర్మాణం విషయంలో కూడా గతంలో చదరపు అడుగుకు రూ.1,100 ఖర్చు అయ్యేదని, దానిని రూ.2,200-2,300కు పెంచి దోచేశారని సీఎం జగన్ ఆరోపించారు. షేర్వాల్ పేరుతో పేదల మీద భారం వేస్తారా? అని ప్రశ్నించారు. అర్బన్ హౌసింగ్లో ఫ్లాట్ల నిర్మాణాలపై రివర్స్ టెండరింగ్కు వెళ్లాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. జగన్ ఇప్పటి వరకు ప్రాజెక్టులపై రివర్స్ టెండరింగ్ కు వెళ్తానని పదేపదే హెచ్చరిం చారు. వైయస్ జగన్ తొలిసారిగా అర్బన్ హౌసింగ్ స్కీమ్ విషయంలో రివర్స్ టెండరింగ్ కు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఏదైతే సాంకేతికతతో నిర్మాణాలు కొనసాగుతున్నాయో అదే సాంకేతికతతో రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని సీఎం వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు.
Recommended Video
రివర్స్ టెండరింగ్ తో ప్రభుత్వ ఖజానాకు మేలు కలుగుతుందన్న భావన .. పేదలపై భారం పడకూడదని నిర్ణయం
ఇక ఈ రివర్స్ టెండరింగ్ లో వీలైనంత ఎక్కువమంది పాల్గొనేలా చూడాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా వీలైనంత ఆదా చేయాలని అధికారులకు సూచించారు. షేర్ వాల్ టెక్నాలజీ పేరుతో గత ప్రభుత్వంలా పేద ప్రజలపై భారం మోపే చర్యలు తమ ప్రభుత్వంలో జరగకూడదంటూ అధికారులకు ఆదేశించారు. గత ప్రభుత్వంలో గృహ నిర్మాణాల్లోనూ అంతా అవకతవకలే అని , అలాగే ప్రతీ లబ్ధిదారునికి రూ.3లక్షలు ఖర్చు అయ్యేలా గత ప్రభుత్వం చేసిందని పేదలపై భారం వేసిందని జగన్ గుర్తించారు . అందుకే రివర్స్ టెండరింగ్ కు వెళ్లి సాధ్యమైనంత ప్రభుత్వ ఖజానాకు ఆదా చెయ్యాలని సూచించారు. ప్రభుత్వ ఖజానాకు మేలు కలగడమే తమ లక్ష్యమని వైయస్ జగన్ గృహనిర్మాణ శాఖ రివ్యూలో స్పష్టం చేశారు.
రివర్స్ టెండరింగ్ తో ఇప్పటికే టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు చిక్కులు .. జగన్ నిర్ణయం ఫలితం ఎలా ఉంటుందో ?
ఇక రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికి ఇళ్లు ఉండాలని అది కూడా నాణ్యమైన ఇళ్లు అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఇళ్లులేని వారు ఒక్కరు కూడా ఉండకూడదని ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారుడు రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా నిర్ణయం తీసుకున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి నిర్మాణాలు జరగకుండా ఆగిపోయిన వాటిని కూడా త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇకపై గృహనిర్మాణాలు పారదర్శకంగా ఉంటాయని తెలిపారు. రివర్స్ టెండరింగ్ వల్ల కాంట్రాక్టర్ లను వేధించడం అనుకోవద్దు అన్నారు. కానీ రివర్స్ టెండరింగ్ వల్ల కాంట్రాక్టర్లకే తీవ్ర ఇబ్బంది కలుగుతుంది అని ప్రస్తుతం గృహ నిర్మాణ శాఖలో టెండర్లు దక్కించుకుని పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఖర్చు తగ్గించి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉండేలా జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో మరి వేచి చూడాలి.