జగన్ సర్కారును వెంటాడుతున్న నిమ్మగడ్డ కేసు... సుప్రీంకోర్టులోనూ దక్కని ఊరట...
ఏపీలో వైఎస్ జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వాన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ ను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను ఇప్పటికే హైకోర్టు కొట్టేయగా... తాజాగా సుప్రీంకోర్టులోనూ ప్రభుత్వానికి ఊరట దక్కలేదు.
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు కోసం జగన్ సర్కారు ఇచ్చిన ఆర్డినెన్స్ ను హైకోర్టు గతంలో కొట్టివేసింది. అయితే హైకోర్టు తీర్పు నిమ్మగడ్డ నియామకానికి అనుకూలంగా రాలేదని, సాంకేతిక లోపాలున్నాన్నంటూ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీనిపై ఇప్పటికే ఓసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇదేం ఆర్డినెన్స్ అంటూ విస్మయం వ్యక్తం చేసింది. రాజ్యాంగ సంస్ధలతో ఆటలు వద్దంటూ అక్షింతలు వేసింది. అయితే ఇవాళ జరిగిన రెండో దఫా విచారణలోనూ ప్రభుత్వానికి చుక్కెదురైంది.
Recommended Video
నిమ్మగడ్డ తొలగింపు కోసం తాము తెచ్చిన ఆర్డినెన్స్ ను కొట్టేస్తూ హైకోర్టు ఇప్పటికే జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. అయితే తొలి దశ విచారణ సందర్భంగా స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు... తాజాగా ఇవాళ మరోసారి అదే విషయాన్ని పునరుద్ఘాటించింది. దీనిపై ఇప్పటికే విచారణ జరిపామని, తాజాగా దాఖలైన పిటిషన్లపైనా నోటీసులు జారీ చేశాక మరోసారి విచారణ చేపడతామని జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.