ఎపి బిజెపికి మరో షాక్...టిడిపిలోకి భాజపా ముఖ్యనేత;ఎవరంటే?
అమరావతి:ఆంధ్రప్రదేశ్ లో బిజెపికి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవలే బిజెపికి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాయగా ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగి నిలువరించిన సంగతి తెలిసిందే.
ఆ తరువాత తిరుపతిలో జరిగిన ధర్మదీక్ష సభలో చంద్రబాబు సమక్షంలో చిత్తూరు జిల్లా బిజెపి నేత జయరాం టిడిపిలో చేరిన విషయం విదితమే. తాజాగా మరో బిజెపి నేత పార్టీని వీడేందుకు సిద్దమవడం భారతీయ జనతా పార్టీ నేతల్లో కలవరం కలిగిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన భాజపా ముఖ్య నేత రఘురామ కృష్ణంరాజు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశంలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
శుక్రవారం సాయంత్రం ఆయన సిఎం చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు సమాచారం. అందుకోసం పలువురు బిజెపి కార్యకర్తలు, అనుచరులు, మద్దతుదారులతో కలిసి ఊరేగింపుగా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి రానున్నట్లు తెలిసింది. దీంతో రాష్ట్రంలో బిజెపి నేతలు ఒక్కొక్కరే పార్టీని వీడుతుండటం అసలే ఇబ్బందుల్లో ఉన్న ఎపి బిజెపిని మరింత ఇక్కట్ల పాలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు టిడిపి లోకి బిజెపి నుంచి మరిన్ని వలసలు ఖాయమని తెలుగుదేశం పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రఘురామకృష్ణం రాజు జగన్ కేసులకు సంబంధించి అప్పటి సిబిఐ జెడి లక్ష్మీనారాయణ కాల్ లిస్టుల లీకేజీ వ్యవహారంలో నిందితుడుగాను, ఆ తరువాత అంజనారెడ్డిపై ఛీటింగ్ కేసు, ఇటీవలి సంక్రాంతి కోడి పందాల కేసులకు వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే.