ఎపికి కేంద్రం మరో షాక్...విశాఖకు రూ.100కోట్లు నిలిపివేత...మన తప్పేనా!
అమరావతి: ఒక వైపు బడ్జెట్ తదనంతర పరిణామాలతో టిడిపి పార్లమెంటులో ఆందోళన చేస్తుండగానే మరోవైపు కేంద్రం తాజాగా ఆంధ్రప్రదేశ్ కు మరో షాక్ ఇచ్చింది. అసలే నిధుల లేమితో ఉన్న ఎపికి కేంద్రం నుంచి రావాల్సిన మరో 100 కోట్ల రూపాయలు నిలిచిపోయాయి. విశాఖ నగరం అభివృద్ది కోసం ఈ వంద కోట్లు రావాల్సి ఉండగా ఈ నిధులు నిలిపివేసినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఈ నిధుల నిలిపివేతకు కారణం ఎపి ప్రభుత్వం నిబంధనలు పాటించకపోవడమేనని తెలుస్తోంది.
'అమృత్ పథకం'లో భాగంగా దేశంలోని పలు నగరాల అభివృద్ధికి కేంద్రం ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తోంది. అందులో భాగంగానే విశాఖ అభివృద్ధికి రూ. 100 కోట్లు ఇస్తోంది. అయితే తాజాగా విశాఖపట్నం నగర అభివృద్ధికి ఇస్తున్న ఈ వంద కోట్ల రూపాయలను కేంద్రం నిలిపేసింది.
అంతేకాదు ఇకపై కేంద్రం నుండి విశాఖ అభివృద్ధికి నిధులు మంజూరు చేసేది లేదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సమాచారం ఇచ్చిందట. అయితే వాస్తవంగా ఈ విషయంలో కేంద్రం తప్పు లేదంటున్నారు. కేంద్రం అమలు చేసే అమృత్ పథకంలో నగరాల అభివృద్ధికి నిధులు రావాలంటే నిబంధనల ప్రకారం ఖచ్చితంగా పాలకవర్గం ఉండితీరాలి. కానీ విశాఖపట్నం నగర పాలక సంస్ద గడువు ముగిసి ఇప్పటికి 6 సంవత్సరాలైంది.
చంద్రబాబు వచ్చిన దగ్గర నుండి విశాఖపట్నం కార్పొరేషన్ కు ఎన్నికలు నిర్వహించలేదు. అధికారులు ఇదే విషయం ఎన్ని సార్లు చెప్పినా సిఎం చంద్రబాబు పట్టించుకోలేదంటున్నారు. అమృత్ పథకం నిధుల విడుదల విషయంలోను కేంద్రం కూడా ఈ విషయమై రాష్ట్రప్రభుత్వాన్ని పలుమార్లు హెచ్చరించిందట.అయినా పాలకవర్గం ఏర్పాటు చెయ్యలేకపోవడంతో...కేంద్రం విశాఖపట్నం అభివృద్ధికి నిధులను నిలిపివేసినట్లు తెలిసింది...ఏదేమైనా అసలే కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఈ వంద కోట్ల నిలిపివేత మరో నష్టంగా పరిణమించింది.