టీడీపీకి మరో షాక్ .. బీజేపీలోకి మరో కీలక నేత 'తోట' జంప్ ?
ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. అసలే ఇబ్బందుల్లో ఉన్న టీడీపీకు నేతల పార్టీ మార్పు నిర్ణయాలు మరింత ఇబ్బంది పెడుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేసిన విశాఖ జిల్లాలో సీనియర్ నాయకుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్, టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారు.
టీడీపీలో కొనసాగాలంటే ఇబ్బంది పడుతున్న నేతలు
గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి పాలవడంతో టిడిపి శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. ఇక ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసిపి , టిడిపి నేతలను టార్గెట్ చేసుకొని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగడానికి చాలామంది నేతలు భయపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రులుగా చేసిన నేతలు సైతం ఇప్పుడు అధికార పార్టీ పాలన పై మాట్లాడితే ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందో అని సైలెంట్ గా ఉంటున్నారు.
టీడీపీ నేతల మధ్య సఖ్యత లేకపోవటమే కారణం
ఇక అంతేకాదు అటు టీడీపీ శ్రేణులు సైతం ఎన్నికల్లో పరాజయం తరువాత ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారిపోయారు. దీంతో పార్టీలో కొనసాగాలన్న ఆలోచన లేకుండా పోతుంది. ఇక రాష్ట్రంలోను, పాయక రావుపేటలోనూ టీడీపీ పరాజయం పాలవడంతోపాటు నియోజకవర్గంలో వర్గాలుగా విడిపోయిన టీడీపీ నాయకులు ఒకటిగా కలిసే అవకాశం కనిపించడం లేదు. అప్పటి నుంచి విశాఖ టీడీపీ కీలక నేత తోట నగేష్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎన్నికలు ముగిసి 5 నెలలైనా పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు రాకపోవడంతో టీడీపీకి గుడ్ బై చెప్పడానికి తోట నగేష్ సిద్ధమయ్యారు.
తన మద్దతుదార్లతో తోట నగేష్ చర్చలు
ఈ నేపధ్యంలో పార్టీ మారాలని నిర్ణయించుకున్న ఆయన నియోజకవర్గంలో పట్టున్న పలు గ్రామాల్లో పర్యటించి తన మద్దతుదార్లను కూడగట్టుకునే ప్రయత్నం చేశారు. అదే విధంగా గత కొద్ది నెలలుగా తోట నగేష్ ను పార్టీ లోనికి ఆహ్వానిస్తూ బీజేపీ, వైసీపీ నేతలు కూడా చర్చలు జరుపుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు కర్జీ ఆయనతో మంతనాలు జరిపారు. పాయకరావుపేటలోని తోట నగేష్ ఇంటికి వచ్చి మరీ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.
బీజేపీ నేతలతో మంతనాలు .. నేడు బీజేపీలో చేరే ఛాన్స్
చివరకు తోట నగేష్ బీజేపీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ నాయకులతో మంతనాలు కూడా బుధవారం పూర్తిస్థాయిలో జరిగాయి. పార్టీ మార్పుపై పూర్తి క్లారిటీ తో ఉన్న తోట నగేష్ నేడు తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.ఆయన బీజేపీలో చేరనున్నారని తెలుస్తుంది. ఇక ఆయనకు జిల్లాలో గాని, రాష్ట్రంలో గాని కీలకమైన పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా విశాఖలో పార్టీ సీనియర్ నాయకుడైన తోట నగేష్ టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడం అటు టీడీపీ కే కాదు, అధినేత చంద్రబాబుకు సైతం షాకింగ్ న్యూస్ అని చెప్పాలి.