జగన్ సర్కార్ కు కేంద్రం మరో షాక్ .. పోలవరం ప్రాజెక్ట్ నిధులకు మరింత కోత ?
పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం కొర్రీలు పెడుతుంది. మొన్నటికి మొన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిధులను మాత్రమే ఇస్తామని, పునరావాసంతో తమకు సంబంధం లేదని కేంద్రం తేల్చింది. అంతేకాదు 2013 -2014 అంచనా వ్యయం ప్రకారం మాత్రమే నిధులను ఇస్తామని తేల్చి చెప్పింది. ఇక తాజాగా పోలవరం ప్రాజెక్టు విషయంలో నిధులకు కోత పెట్టే మరో నిర్ణయం తెరపైకి తీసుకువచ్చింది కేంద్రం. ఈ నిర్ణయం తో ఏపీ సర్కార్ కు మరోమారు గట్టిగానే షాక్ ఇస్తోంది కేంద్ర సర్కార్.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై నీలినీడలు .. కేంద్రాన్ని ఒప్పించేందుకు జగన్ సర్కార్ వ్యూహం ఏంటి ?
తాగునీటి విభాగానికి, విద్యుత్ కేంద్రం నిర్మాణానికి నిధులు ఇవ్వబోమని చెప్పిన కేంద్రం
పోలవరం ప్రాజెక్టు తాజా లెక్కల ప్రకారం తాగునీటి విభాగానికి, విద్యుత్ కేంద్రం నిర్మాణానికి నిధులు ఇవ్వబోమని కేంద్రం తేల్చి చెబుతోంది. ఒకవేళ తాగునీటి పనులకు ,విద్యుత్ కేంద్ర పనులకు నిధులు ఇచ్చి ఉంటే ఇకపై చెల్లించ పోయే బిల్లుల నుంచి ఆ మొత్తాలను మినహాయించాలంటూ కేంద్ర జల శక్తి శాఖ ఉన్నతాధికారి తాజాగా ఒక లేఖ పంపినట్లు గా తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన నిధులలో పెద్ద ఎత్తున కొర్రీలు పెట్టి ఏపీ సర్కార్ ను ఇబ్బంది పెడుతుంటే, ఇక తాజాగా ఈ నిర్ణయం ఏపీ సర్కార్ ను మరింత ఇరకాటంలో పెడుతోంది.
నిధులు చెల్లించటంలో అడుగడుగునా కొర్రీలు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన వ్యయాన్ని కేంద్రం తిరిగి చెల్లించాల్సి ఉంది . దీనికి సంబంధించి రూ. 2234.288 కోట్ల చెల్లింపుపై అన్ని స్థాయిలలోనూ తనిఖీలు పూర్తయి కేంద్ర ఆర్థిక శాఖకు చేరింది. ఇక ఆ నిధులు చెల్లించడం లో కేంద్ర ఆర్థిక శాఖ రకరకాల షరతులు విధిస్తూ ఏపీ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తోంది. 2014 పోలవరం ప్రాజెక్టు క్వాంటిటీ ధరల ప్రకారం 20398.61 కోట్ల రూపాయలకు డీపిఆర్ 2 ఖరారు చేసినట్లుగా ఆర్థికశాఖ పేర్కొంది.
ఇప్పటి వరకు రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ క్రింద ఇచ్చిన నిధులు రూ. 8,614 .16 కోట్లు
పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి ముందు ఆడిట్ చేసిన లెక్కల ప్రకారం వేల 4730 .71 కోట్ల రూపాయలు ఖర్చయింది. అయితే ప్రాజెక్టుగా ప్రకటించక ముందు ఖర్చు చేసిన నిధులను ఇవ్వబోమని కేంద్ర ఇప్పటికే తేల్చి చెప్పింది. ఇక ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్రానికి చెల్లించిన మొత్తం రూ. 8,614 .16 కోట్లుగా ఉంది.
ఇక తాజాగా తాగునీటి పనులకు, విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ఖర్చు చేసిన నిధులను ఇవ్వబోమని తేల్చి చెప్పడంతో, ఇప్పటివరకు రాష్ట్రానికి ఇచ్చిన నిధులలో వాటికోసం కేటాయించిన నిధులను మినహాయింపు చేయాల్సి ఉంటుంది.
Recommended Video
తాగునీటికి , విద్యుత్ కేంద్ర నిర్మాణానికి చెల్లింపులు చేస్తే వాటిని మినహాయించాలన్న కేంద్రం
తాగునీటి , విద్యుత్ కేంద్ర నిర్మాణం విభాగాల కింద ఏమైనా చెల్లింపులు జరిగాయని గుర్తిస్తే ఆ చెల్లించిన మొత్తాన్ని ఇకపై కేంద్రం ఇచ్చే బిల్లులో మినహాయించుకోవాల్సి ఉంటుంది .ఈ లెక్కన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం భారీగానే కొర్రి పెట్టినట్లుగా అర్థమవుతుంది. రోజుకో కొత్త విషయాలు పోలవరం ప్రాజెక్టు విషయంలో వెలుగులోకి రావడంతో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలతో, అసలే ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న ఏపీ ప్రభుత్వానికి, పోలవరం ప్రాజెక్టు తలకు మించిన భారంగా మారుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు.