కర్నూలు టీడీపీకి మరో షాక్ ... బీజేపీలోకి మొన్న భూమా నేడు గంగుల
కర్నూలు తెలుగుదేశం పార్టీకి మరో పెద్ద షాక్ తగిలింది. మొన్నటికి మొన్న భూమా సోదరులు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక తాజాగా టీడీపీలో కీలక నేతగా ఉన్న సీనియర్ రాజకీయ నాయకుడు గంగుల ప్రతాప్ రెడ్డి కూడా బిజెపి తీర్థం పుచ్చుకోడానికి సిద్ధమైపోయారు. అందులో భాగంగా ఆయన బిజెపి జాతీయ నాయకులను కలిసి చర్చించారు.
కర్నూలు రాజకీయాల్లో చక్రం తిప్పే నేతలను వలస బాట పట్టిస్తున్న బీజేపీ
ఏపిలో బిజెపి టిడిపి లోని కీలక నేతల పై ఫోకస్ చేసింది. వారిని ఎలాగైనా బిజెపిలోకి తీసుకురావడంపై దృష్టిసారించింది. ఇక అందులో భాగంగా మొన్నటికి మొన్న భూమా సోదరులను బిజెపిలో చేర్చుకుంది. ఇప్పుడు తాజాగా గంగుల ప్రతాప్ రెడ్డిని కూడా బిజెపిలోకి ఆహ్వానించి కర్నూలు రాజకీయాల్లో గట్టి బేస్ వేసుకుంది బిజెపి. ఏపీలో పార్టీని బలోపేతం చేయడానికి సంకల్పించిన అధినాయకత్వం ఆ దిశగా పావులు కదుపుతోంది. ముఖ్యంగా టిడిపి నాయకులను టార్గెట్ చేసుకుని టిడిపిని ఖాళీ చేసే పనిలో పడింది. ఒక్క టీడీపీ మాత్రమే కాకుండా ఏపీ లోని ఇతర పార్టీలను సైతం టార్గెట్ చేస్తూ వలసలకు ప్రోత్సహిస్తుంది బిజెపి.
Recommended Video
గంగుల ప్రతాప్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించిన నేతలు .. టీడీపీకి షాక్
ఇక తాజాగా నంద్యాల లో తెలుగుదేశం పార్టీని మరోసారి దెబ్బతీసిన బిజెపి, సీనియర్ నేత గంగుల ప్రతాప్ రెడ్డి ని పార్టీలోకి ఆహ్వానించింది. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుండి టిడిపిలో చేరిన గంగుల ప్రతాపరెడ్డి ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడానికి కృషి చేశారు. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా , ఒకసారి ఎంపీగా పని చేశారు. ఇక నంద్యాల నుండి పీవీ నరసింహారావు పోటీ చేసే సమయంలో ఆయన తన టికెట్ ను ఆయన కోసం త్యాగం చేశారు. కర్నూలు రాజకీయాల్లో ఆయనకు అపారమైన పట్టుంది. ఇక గత సార్వత్రిక ఎన్నికల్లో టి.డి.పి ఓటమి పాలు కావడంతో రాజకీయాలకు కాస్త దూరంగానే ఉంటూ వచ్చారు. ఆళ్లగడ్డ ,నంద్యాల నియోజకవర్గాలలో గంగుల ప్రతాప్ రెడ్డి కి గట్టి పట్టు ఉన్న నేపథ్యంలో బిజెపి నేతలు రామ్ మాధవ్, మురళీధర్ రావులు ఢిల్లీకి పిలిచిమరీ గంగుల ప్రతాప్ రెడ్డి తో మంతనాలు జరిపి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆయన కూడా బీజేపీ లో చేరడానికి సిద్ధమైపోయారు.
బీజేపీ బాట పట్టిన టీడీపీ నేతలు .... మొన్న భూమా నేడు గంగుల
అసలే మొన్నటి ఎన్నికలతో గట్టి దెబ్బ తగిలిన టీడీపీకి ఇప్పుడు తాజాగా గంగుల ప్రతాపరెడ్డి కూడా పార్టీని వీడి వెళ్ళడం పెద్ద దెబ్బ అని చెప్పాలి.
మొన్నటికి మొన్న జిల్లా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి ఏకైక పెద్ద దిక్కు భూమా కుటుంబంనుండి భూమా కిశోర్ రెడ్డి, భూమా మహేశ్వర్ రెడ్డి, భూమా వీరభద్ర రెడ్డి తమ అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. ఇప్పుడు తాజాగా కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన టీడీపీ సీనియర్ నేత గంగుల ప్రతాప్ రెడ్డి, జనసేన నేత పసుపులేటి సుధాకర్ కూడా బీజేపీలో చేరారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా , జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో కాషాయకండువా కప్పుకున్నారు.అనంతరం మురళీధరరావు మాట్లాడుతూ, ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా బీజేపీ ఎదుగుతుందని అన్నారు. దక్షిణాదిలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా చేరికలను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు.
ఇక కర్నూలు రాజకీయాల్లో టీడీపీ కి బలమైన నాయకులు లేనట్టేనా ?
ప్రస్తుతం కర్నూలు రాజకీయాల్లో టీడీపీకి చెప్పుకోదగ్గ నేత లేరు. బీసీ జనార్ధన్, బీవీ జయనాగేశ్వర రెడ్డి వంటి వారు తప్ప పార్టీకి నాయకత్వాన్ని వహించగల నేత ప్రస్తుతానికి కనిపించట్లేదు. పార్టీలో పట్టు కోసమే భూమా నాగిరెడ్డి ని టీడీపీలో చేర్చుకున్నారు చంద్రబాబు . నాగిరెడ్డి హఠాన్మరణానికి గురి కావడం, భూమా అఖిల ప్రియను మంత్రివర్గంలోకి తీసుకున్నప్పటికీ.. జిల్లా రాజకీయాలపై పట్టు సాధించలేకపోవడం పార్టీని దిగజార్చింది. ఇక ప్రస్తుతం ఇంతో అంతో పార్టీలో కీలకంగా ఉన్న గంగుల ప్రతాప్ రెడ్డి పార్టీ ఫిరాయించటం చంద్రబాబుకు అసలు మింగుడు పడటం లేదు.