జేసీ బ్రదర్స్ కు మరో షాక్: దివాకర్ ట్రావెల్స్లోని బస్సుల రిజిస్టేషన్ల రద్దుకు చర్యలు
జేసీ బ్రదర్స్ కు మరోమారు భారీ షాక్ ఇవ్వటానికి రంగం సిద్ధం చేస్తున్నారు రవాణా శాఖాధికారులు . తప్పుడు సమాచారం ఇచ్చిన, ఫోర్జరీలకు పాల్పడి, నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్స్ తో మోసం చేసిన జేసీ బ్రదర్స్ కు సంబంధించిన దివాకర్ ట్రావెల్స్ బస్సుల రిజిస్ట్రేషన్ రద్దు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు అధికారులు.
వెలుగులోకి దివాకర్ ట్రావెల్స్ అక్రమాలు
ఫోర్జరీ సంతకాలు, దొంగ స్టాంపులు, నకిలీ పత్రాలతో అధికారులను మోసం చేస్తూ అక్రమాలకూ పాల్పడుతున్న దివాకర్ ట్రావెల్స్ పై ఉక్కు పాదం మోపుతున్న రవాణా శాఖ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రవాణాశాఖ జరుపుతున్న దర్యాప్తులో అనేక వాస్తవాలు బయటకు వస్తున్న విషయం తెలిసిందే . ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు, నాగాలాండ్ రాష్ట్రాల్లో సైతం దివాకర్ ట్రావెల్స్ అక్రమాలకు పాల్పడినట్లుపూర్తి ఆధారాలు లభించాయని విజిలెన్స్ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు పేర్కొన్నారు.
స్క్రాప్ లారీలను బస్సులుగా మార్చిన ట్రావెల్స్
ఇక స్క్రాప్ లారీలను బస్సులుగా మార్చి వాటికి డాక్యుమెంట్స్ నకిలీవి తయారు చేసి జేసీ బ్రదర్స్ దివాకర్ ట్రావెల్స్ పేరు మీద చేసిన దందా తీగ లాగితే డొంక కదిలింది. అశోక్ లేలాండ్ వద్ద స్క్రాప్ లారీలను కొనుగోలు చేసి బస్సులుగా రిజిస్టర్ చేయించారని, సి.గోపాల్రెడ్డి అండ్ కంపెనీ పేరుతో 43 వాహనాలు, జఠాథర కంపెనీ పేరుతో 26 వాహనాలు కొన్నట్లు రికార్డులు సృష్టించారని వెల్లడించిన విజిలెన్స్ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు ఇక వీటి రిజిస్ట్రేషన్ రద్దు చేయనున్నట్టు తెలిపారు.
ఆ బస్సుల రిజిస్టేషన్ల రద్దుకు చర్యలు
ఇక ఈ కేసులో నాగాలాండ్ లో కూడా దర్యాప్తు చేస్తున్న అధికారులు దివాకర్ ట్రావెల్స్ ఇచ్చినవన్నీ బోగస్ సర్టిఫికెట్లు అని నిర్ధారణకు వచ్చారు. ఇప్పటి వరకు 66 స్క్రాప్ లారీలను బస్సులుగా మర్చినట్లు గుర్తించారని, మరో 88 వాహనాలు కూడా ఉన్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. సుప్రీంకోర్టు చట్టాల ప్రకారం ఈ బస్సులకు అనుమతి లేదని చెప్పిన ఆయన జేసీ బ్రదర్స్ కు సంబంధించిన ట్రావెల్స్లోని బస్సుల రిజిస్టేషన్ల రద్దుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
ఏపీలోనే కాదు ఇతర రాష్ట్రాలోనూ రిజిస్ట్రేషన్ రద్దు చేసేలా చర్యలు
ఇక ఏపీలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా సమాచారం ఇచ్చామని ,అక్కడ కూడా రిజిస్ట్రేషన్లు రద్దు అవుతాయని చెప్తున్నారు. మొత్తానికి దివాకర్ ట్రావెల్స్ రవాణా శాఖ ఉక్కు పాదం మోపుతున్న నేపధ్యంలో దిక్కుతోచని స్థితికి చేరుకుంది. జేసీ బ్రదర్స్ ఆర్ధిక మూలాలపై ఏపీ సర్కార్ వరుసగా కొడుతున్న దెబ్బలకు కుదేలవుతున్నారు. జగన్ సర్కార్ వేసిన ఉచ్చులో చిక్కుకుని బయటపడే దారి లేక ఆందోళన చెందుతున్నారు.