రాష్ట్రంలో మరో ప్రత్యేక పోలీస్ వింగ్, టాస్క్ ఫోర్స్ ప్రారంభం:ప్రకటన విడుదల చేసిన హోం శాఖ
అమరావతి:వదంతుల ఆధారంగా అల్లరి మూకలు విచక్షణారహితంగా హింసాత్మక ఘటనలకు పాల్పడితే చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఎఆర్ అనురాధ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
అలాంటి వదంతులు, దాడులను చట్టం తీవ్రంగా పరిగణిస్తుందని ఎఆర్ అనురాధ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇటువంటి వదంతులు వ్యాపించకుండా, రెచ్చగొట్టే ఘటనలు జరుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆమె వెల్లడించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఉన్నత స్థాయి పోలీసు అధికారులను నోడల్ అధికారులుగా నియమించామని ఆమె తెలిపారు.
ఈ తరహా వదంతులు, దాడుల నియంత్రణ కోసం ప్రతి జిల్లాలో ఒక ఎస్పీని, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలలోని కమిషనరేట్ లలో ఎస్పీ స్థాయి అధికారిని నోడల్ అధికారులుగా నియమించామని ఆమె వివరించారు. అలాగే ప్రతి జిల్లాలోని ఈ నోడల్ ఆఫీసర్కు సహాయకులుగా ఒక డీఎస్పీని కూడా నియమించడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఈ దాడులను నిలువరించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను కూడా ఏర్పాటు చేశామని హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఎఆర్ అనురాధ తెలిపారు.
అయితే హోం శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ ప్రకటన పోలీసు వర్గాల్లో, రాజకీయ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణమేమై ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇలాంటి దాడులు జరుగుతాయనే సమాచారం ఏమైనా అందిందా?...లే మరేదైనా ప్రత్యేక ఉద్దేశ్యంతోటి ఈ అధికారుల, టాస్క్ ఫోర్స్ ల నియామకం జరిగిందా అనే విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎపిలో ఐటి దాడుల నేపథ్యంలో వివిధ రకాల వదంతులు వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఈ నియామకాలు జరగడంతో...ఇంత సత్వరమే ఈ నియామకాలు జరగడం వెనుక కారణామేదైనా ఉందా అనే కోణంలో కూడా కొందరు తమ వాదనలు, విశ్లేషణలు వినిపిస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి వింగ్ ఒకటి ఉండటం మంచిదనే అభిప్రాయం సాధారణ జనాల్లో వ్యక్తం అవుతుండటం గమనార్హం.