వరంగల్లో కరోనా పాజటిటివ్ కేసు? ఢిల్లీలో థియేటర్లు మూసివేత.. త్వరలో అన్ని రాష్ట్రాల్లోనూ?
కరోనా మహమ్మారి ప్రభావం గంటగంటలకూ తీవ్రతరమవుతున్నది. ఏపీలోని నెల్లూరులో తొలి పాజిటివ్ కేసు బయటపడటంతో దేశవ్యాప్తంగా ఎఫెక్టెడ్ కేసుల సంఖ్య 74కు పెరిగింది. ప్రస్తుతం 1500 మంది అనుమానితుల్ని అబ్జర్వేషన్ లో ఉంచినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ వో) కరోనావైరస్ ను మహమ్మారి(పడమిక్)గా ప్రకటించిన నేపథ్యంలో.. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం విపత్తు నిర్వహణ చట్టం, ఎపిడెమిక్ డిసీజెస్ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. దీన్ని అనుసరించి అన్ని రాష్ట్రాల్లో పబ్లిక్ ప్లేసులు, ఆఫీసులు, థియేటర్ల మూసివేతకు ఆదేశాలు వెలువడొచ్చనే ప్రచారం జరుగుతోంది.
ఈలోపే ఢిల్లీ సర్కారు.. తన పరిధిలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లను ఈ నెల 31 వరకు మూసేయాలని గురువారం ఆదేశాలు జారీచేసింది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు రెట్టింపు కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ భరోసా కల్పించారు. పానిక్ కావొద్దని, ప్రికాషన్స్ పాటించాలని ఆయన ట్వీట్ చేశారు.
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా తెలంగాణలో మాత్రం పాజిటివ్ పేషెంట్ లేకపోవడం శుభపరిణామమని ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ప్రకటన చేసిన కొద్దిగంటలకే వరంగల్ జిల్లా కొత్త కేసు వార్తలు గుప్పుమన్నాయి. కాజీపేటలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ) విద్యార్థికి కరోనా లక్షణాలు బయటపడ్డాయని, ప్రస్తుతం అతణ్ని ఎంజీఎంలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారని తెలుస్తోంది.
కరోనా లక్షణాలు బయటపడిన ఆ విద్యార్థి ఇటీవలే అమెరికా నుంచి తిరిగొచ్చాడని, దగ్గు, జర్వరం ఎంతకూ తగ్గకపోవడంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా, అక్కడి నుంచి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారని వెల్లడైంది. అయితే సదరు ఎన్ఐటీ విద్యార్థికి కరోనా పాజిటివ్ అని తేలిందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సిఉంది. ఆరు రోజుల కిందట ఇదే వరంగల్ కు చెందిన మరో వ్యక్తి కూడా కరోనా లక్షణాలతో ఎంజీఎంలో చేరగా, అతణ్ని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతను ఈ మధ్యే ఇటలీ నుంచి తిరిగొచ్చినట్లు డాక్టర్లు చెప్పారు.
హైదరాబాద్ లో నమోదైన తొలి కేసుకు సంబంధించి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వైరస్ ప్రభావం నుంచి కోలుకున్నాడని డాక్టర్లు చెప్పారు. కరోనా వ్యాప్తి గురించి తప్పుడు సమాచారాన్ని షేర్ చేసినా, పాజిటివ్ పేషంట్ల వివరాల్ని వెల్లడించినా కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వాలు హెచ్చరించాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 4700కు పెరిగింది. సుమారు 1.30లక్షల మంది వైరస్ బారినపడ్డారు.