వైఎస్ వివేకా హత్యలో కేసులో కీలక విషయాలు బయటపెట్టిన పోలీసులు! పుకార్లు పుట్టించింది అతనే
Recommended Video
కడప: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, మాజీ లోక్ సభ సభ్యుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతంలో కొత్త కోణం తాజాగా వెలుగు చూసింది. వైఎస్ వివేకా గుండెపోటుతో మరణించినట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. హైదరాబాద్ లో నివసిస్తోన్న వివేకా కుటుంబ సభ్యులు కూడా మొదట్లో ఆయన గుండెపోటుతోనే తుదిశ్వాస విడిచి ఉంటారని నిర్ధారణకు వచ్చారు. పోలీసులు వివేకా భౌతిక కాయాన్ని చూసిన తరువాతే.. దారుణంగా హత్యకు గురైనట్లు తేలింది. వివేకా గుండెపోటుతో మరణించారనే విషయాన్ని నమ్మించడానికి ఆయన ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి విశ్వప్రయత్నాలు చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. మొదటగా ఈ పుకారును పుట్టించింది గంగిరెడ్డేనని వారు నిర్ధారించారు.
62 మంది అదుపులో..
కిందటి నెల 15వ తేదీన వైఎస్ వివేకా కడప జిల్లాలోని పులివెందులలో తన సొంత నివాసంలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయన భౌతిక కాయంపై ఏడుచోట్ల పదునైన కత్తి గాయాలు కనిపించాయి. తలపై గొడ్డలితో నరికిన ఆనవాళ్లు ఉన్నాయి. ఈ హత్యపై దర్యాప్తు చేపట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఈ కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రధాన నిందితులుగా వివేకా కుడిభుజంగా చెప్పుకొనే ఎర్ర గంగిరెడ్డి, ప్రకాశ్ రెడ్డి, వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారిస్తున్నారు. ఈ కేసులో మొత్తం 62 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహిస్తున్నారు.
రక్తం మరకలను తుడిచేసి, గుండెపోటుగా పుకారు
వైఎస్ వివేకాను హత్య చేసినట్లుగా భావిస్తోన్న బెడ్ రూమ్ లో రక్తపు మరకలను తుడిచినట్లు పోలీసులు ముందే నిర్ధారించారు. అనంతరం- బాత్ రూమ్ లోకి తీసుకెళ్లి.. భౌతిక కాయంపై ఉన్న రక్తపు మరకలను కూడా తుడిచేయడానికి ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య జరిగినట్లు ఆనవాళ్లేమీ కనిపించకుండా చేసి, గుండెపోటుతో మరణించినట్లు పుకార్లు పుట్టించాలనేది వారి వ్యూహమని పోలీసులు అంటున్నారు. అందుకే- తొలుత వివేకా గుండెపోటుతో మరణించినట్లు పుకార్లు పుట్టించినట్లు తమ దర్యాప్తులో తేలినట్లు చెబుతున్నారు. నరికినట్లు ఆనవాళ్లు కనిపించకుండా తలకు బ్యాండేజీ కట్టడం కూడా ఇందులో భాగమేనని తెలిపారు. భౌతిక కాయాన్ని చూసిన వెంటనే.. అది హత్యగా పోలీసులు నిర్ధారించారు.
సంఘటనాస్థలంలో వాళ్లు కూడా..
వివేకా హత్య కేసులో మరికొన్ని పేర్లు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో నలుగురికి ఈ కేసులో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వారే.. పనిమనిషి లక్ష్మి, రాజశేఖర్, ఇనాయతుల్లా, ట్యాంకర్ భాషా. గంగిరెడ్డి, ప్రకాష్ రెడ్డి, కృష్ణారెడ్డిలతో పాటు ఈ నలుగురు కూడా సంఘటనాస్థలంలో ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. గుండెపోటుతో మరణించినట్లు పుకార్లు పుట్టించాలని గంగిరెడ్డే తమకు సూచించారని లక్ష్మి పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. లక్ష్మి బెడ్ రూమ్ లో రక్తపు మరకలు తుడిచారని, గంగిరెడ్డి, ఇనాయతుల్లా, ట్యాంకర్ బాషా, రాజశేఖర్తో కలిసి వివేకానందరెడ్డి భౌతిక కాయాన్ని బాత్ రూమ్ లో నుంచి బెడ్ రూమ్ లోకి తీసుకొచ్చారని కృష్ణారెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
విచారణ ప్రక్రియ మొత్తం వీడియో..
నాలుగు రోజుల పాటు వారందరూ రిమాండ్ లో ఉన్నారు. పులివెందుల న్యాయస్థానం అనుమతితో పోలీసులు నిందితులను వేముల పోలీసుస్టేషన్లో ఉంచి, విచారించారు. పులివెందుల డీఎస్పీ నాగరాజ ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు విచారణ ప్రక్రియ మొత్తాన్నీ వీడియో తీశారు. పోలీసు కస్టడీ ముగియడంతో సోమవారం ముగ్గురినీ పులివెందుల కోర్టులో హాజరు పరిచారు. వారికి కోర్టు ఈనెల 22వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. విచారణలో వెల్లడించిన అంశాలను పోలీసులను నివేదిక రూపంలో కోర్టులో అందజేశారు.