సంచలనం:తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజ్ లో మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య
Recommended Video
తిరుపతి:ఎస్వీ మెడికల్ లో మరో విద్యార్ధిని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న పుట్లూరు గీతిక తిరుపతి శివజ్యోతినగర్ లోని తన ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
సరిగ్గా వారం క్రిందట ఇదే కళాశాలకు చెందిన పీజీ వైద్య విద్యార్ధిని డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకున్న ఘటన పెను ప్రకంపనలు సృష్టించగా, ఇంకా ఆ సంఘటన మరువకముందే మరో వైద్య విద్యార్ధిని సూసైడ్ చేసుకోవడం సంచలనం కలిగిస్తోంది. మరో రెండు రోజుల్లో ఎంబీబీఎస్ సెకండియర్ కు సంబంధించి ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉండటంతో మానసిక ఒత్తిడికి గురై ఇలా ప్రాణాలు తీసుకొని ఉంటుందని భావిస్తున్నారు.
గత ఆదివారం ఎస్వీ మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థిని శిల్ప ఆత్మహత్య చేసుకోగా ప్రొఫెసర్ల వేధింపుల కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ అప్పటి నుంచి వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇదే కళాశాలలో మరో మెడికో పుట్లూరు గీతిక ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది.
కడప మారుతీనగర్కు చెందిన హరితాదేవి తన కుమార్తె గీతికతో కలిసి తిరుపతి శివజ్యోతినగర్లో ఉంటున్నారు. గీతిక ఎస్వీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతోంది. సోమవారం ఆమె పాథాలజీ ఇంటర్నల్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం భోజనం చేశాక చదువుకునేందుకని గదిలోకి వెళ్లి తలుపు వేసుకుందని ఆమె తల్లి హరితాదేవి తెలిపారు. కానీ, సాయంత్రం అయినా తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి తలుపు తీసి చూస్తే ఫ్యాన్కు ఉరివేసుకుని ఉందన్నారు.
అప్పటికీ కొన ఊపిరితో ఉన్న ఆమెను హుటాహుటిన 108 వాహనంలో రుయా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందని ఆమె తల్లి హరితాదేవి తెలిపారు. అయితే గీతిక మృతి వెనుక అసలు కారణాలు తెలియాల్సివుంది. కానీ, తన కుమార్తె వ్యక్తిగత కారణంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని హరితాదేవి అంటున్నారు. గీతిక తండ్రి కడప జిల్లాలో న్యాయవాదిగా పనిచేస్తూ రెండేళ్ల క్రితమే మృతిచెందారు. తల్లి హరితాదేవి కూడా కడపలోని ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసేవారు. అయితే, కుమార్తె మెడిసిన్ చదువు కోసమని రెండేళ్ల క్రితం ఆమె టీచర్ వృత్తిని వదిలేసి కుమార్తెతో పాటు వచ్చి తిరుపతిలోనే ఉంటున్నారు.
మరోవైపు వారం వ్యవధిలోనే తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజ్ లో ఇద్దరు వైద్య విద్యార్థుల బలవన్మరణాలతో తోటి విద్యార్థులు, వైద్య వర్గాలు దిగ్భ్రాంతి చెందుతున్నారు. గీతిక ఆత్మహత్య వార్త తెలిసి నిర్ఘాంతపోయామని ప్రభుత్వ వైద్యుల సంఘం, జూనియర్ డాక్టర్ల సంఘం నేతలు శ్రీనివాసరావు, వెంకటరమణ, లావణ్య తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే గీతిక మృతదేహాన్ని సందర్శించి హరితాదేవిని పరామర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే ఇలా పేద, మధ్య తరగతి విద్యార్థుల వరుస ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సంచలనం సృష్టిస్తోన్నతిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థిని గీతిక ఆత్మహత్య కేసులో పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ సూసైడ్ నోట్లో బ్యాంకు ఉద్యోగి పేరు, ఓ మెడికో పేరును గీతిక రాసినట్లు తెలిసింది. ఆ పేర్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసారు.