అనంతలో మరో స్వాతి: వివాహేతర సంబంధానికి అడ్డున్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య
అనంతపురం: అనంతపురం నగర శివారులోని రుద్రంపేట సమీపంలోని ఓ అపార్టుమెంటు వెనుక భాగంలో ఇటీవల గొల్ల కిష్టప్ప హత్యకు గురయ్యాడు. ఈ కేసును నాలుగో పట్టణ పోలీసులు చేధించారు. కేసులో హతుడి భార్యతో పాటు నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
నిందితులు కంబదూరు మండలం నూతిమడుగుకు చెందిన కృష్ణ, కూడేరు మండలం మామిడాకులపల్లికి చెందిన అక్కులన్న అలియాస్ సూరి, రుద్రంపేట పంచాయతీ పంతుల కాలనీకి చెందిన హరి, అగళి మండలం మధుడి గ్రామానికి చెందిన శ్వేత.
గత నెల 26న రుద్రంపేట పంచాయతీ పంతులకాలనీలో నివాసం ఉంటున్న కిష్టప్పను జాతీయ రహదారి కక్కలపల్లి క్రాస్ సమీపంలో హత్య చేశారు. కిష్టప్ప తొమ్మిదేళ్ల క్రితం నిందితులలో ఒకరైన శ్వేతను పెళ్లి చేసుకున్నాడు.
ఇద్దరు కలిసి పండ్ల తోటల్లో కూలీ పని చేసేవారు. ఈ క్రమంలో కిష్టప్పకు నూతిమడుగుకు చెందిన కృష్ణతో పాటు మామిడాకులపల్లికి చెందిన అక్కులన్న అలియాస్ సూరితో పరిచయాలు ఏర్పడ్డాయి. వారిద్దరూ అప్పుడప్పుడూ కిష్టప్ప ఇంటికి వచ్చి వెళ్లేవారు.
ఈ క్రమంలో శ్వేతతో చనువుగా ఉండేవారు. ఈ విషయంపై కిష్టప్ప భార్యను మందలించాడు. దీనిని జీర్ణించుకోలేని భార్య ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. కిష్టప్పను చంపితే తాము కలిసి ఉండవచ్చని కృష్ణతో తెలిపింది.
కృష్ణ కూడా అంగీకరించాడు. అక్కులన్న, హరి, శ్వేత సహాయంతో కృష్ణ కిష్టప్పను హత్య చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.