టీడీపీకి హైఓల్టేజ్ షాక్.. పారిపోయిన మరో ఎమ్మెల్యే! పోటీ చేయలేనంటూ తప్పుకొన్న సిట్టింగ్!
కర్నూలు: రాష్ట్రంలో అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మరో హై ఓల్టేజ్ షాక్! మరో సిట్టింగ్ ఎమ్మెల్యే అస్త్రసన్యాసం చేసేశారు. కర్నూలు జిల్లా శ్రీశైలం ఫిరాయింపు సిట్టింగ్ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎన్నికల బరి నుంచి తప్పుకొని 24 గంటలు కూడా గడవక ముందే- మరో సిట్టింగ్ శాసనసభ్యుడు చేతులు ఎత్తేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయలేనంటూ తప్పుకొన్నారు.
అభ్యర్థిత్వం ప్రకటించిన తరువాత కూడా.. ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీకి విముఖత వ్యక్తం చేయడం జిల్లా రాజకీయాల్లో కలకం రేపుతోంది. ఆయనే బీసీ జనార్ధన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీకి చెందిన బనగాన పల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే. 2014 ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున బనగానపల్లి నుంచి అసెంబ్లీకి గెలుపొందారు.
పారిపోతున్న టీడీపీ అభ్యర్థులు? నిన్న ఆదాల.. నేడు బుడ్డా?
జిల్లా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా వీచినప్పటికీ.. దాన్ని తట్టుకుని, విజయం సాధించగలిగారు. సరిగ్గా అయిదేళ్లు తిరిగే సరికి పరిస్థితి తలకిందులైంది. నియోజకవర్గంలో పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉందని, తాను పోటీ చేసినప్పటికీ.. ఓటమి ఖాయమనే ఆందోళనతోనే బీసీ జనార్ధన్ రెడ్డి పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు.
నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఏర్పడిన బనగానపల్లి నియోజకవర్గంలో 2009లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున కాటసాని రామిరెడ్డి విజయం సాధించారు. అనంతరం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో కాటసాని కూడా కాంగ్రెస్ లోనే కొనసాగారు. విభజన అనంతరం కాటసాని రామిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. 204 ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ.. బీసీ జనార్ధన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
కాగా- వచ్చే ఎన్నికల్లో కూడా వారిద్దరి తలపడుతున్నారు. టీడీపీ తరఫున బీసీ జనార్ధన్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ తరఫున కాటసాని రామిరెడ్డి పోట చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన తొలి జాబితాలోనే బీసీ జనార్ధన్ రెడ్డికి చోటు దక్కింది. దీనితో ఆయన ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు. రెండు రోజులుగా ఆయన స్తబ్దుగా ఉంటున్నారు. నియోజకవర్గంలో పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈ సారి ఓటమి ఖాయమని అంచనాకు రావడంతో.. పోటీ నుంచి తప్పుకోవాలని బీసీ జనార్దన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఫలితంగా- తెలుగుదేశం పార్టీ మరో అభ్యర్థి కోసం అన్వేషణ మొదలు పెట్టంది. నామినేషన్ల పర్వం ముగియడానికి ఇక అయిదు రోజులే మిగిలి ఉంది. నియెజకవర్గంలో బలమైన నాయకుడిగా గుర్తింపు ఉన్న చల్లా రామకృష్ణా రెడ్డి మొన్నటిదాకా పార్టీలో కొనసాగారు. కొద్దిరోజుల కిందటే వైఎస్ఆర్ సీపీ కండువా కప్పుకొన్నారు. దీనితో కొత్త ముఖాన్ని తెరపైకి తీసుకుని రావడం టీడీపీకి అనివార్యమైంది.