రాజధాని గ్రామాల్లో మరోసారి ఉద్రిక్తత ... రెవెన్యూ అధికారుల్ని అడ్డుకున్న రైతులు
రాజధాని అమరావతిలో ఇటీవల రెవెన్యూ అధికారుల సర్వేలు రైతులను ఆందోళనలకు గురి చేస్తున్నాయి. ఇక తాజాగా రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించాలని వెళ్ళిన క్రమంలో రైతుల ధర్నాతో మందడంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పేదలకు భూములు ఇస్తామంటూ అమరావతి పరిధిలోని మందడం, కృష్ణాయపాలెం గ్రామాల్లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. దీంతో రైతులు వారిని అడ్డుకుని రోడ్డుపై ధర్నాకు దిగారు. తహశీల్దార్, రెవెన్యూ అధికారులను అడ్డుకుని, వారి కార్లను నిలిపివేశారు. సర్వే చెయ్యకుండా అడ్డుకున్నారు.
వైజాగ్ రాజధాని మాత్రమే కాదు సీఎం జగన్ నిర్ణయంతో అలా కూడా అభివృద్ధి బాటలో
అమరావతిలో భూముల్ని సర్వే చేసేందుకు వచ్చిన తహసీల్దార్, ఇతర రెవెన్యూ అధికారుల్ని అడ్డుకున్న రాజధాని రైతులు తమ భూములు ఎలా సర్వే చేస్తారంటూ వచ్చిన అధికారులపై మండిపడ్డారు. సర్వే చేయనిచ్చేది లేదంటూ రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేశారు . రెవెన్యూ అధికారులను అడ్డుకోవడంతో పోలీసులు అక్కడి చేరుకున్నారు. రాజధాని రైతులకు సర్ది చెప్పే యత్నం చేసినా ఆందోళన విరమించకపోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఇక రాజధాని గ్రామాల రైతులు తమ భూములను ఇచ్చింది రాజధాని కోసమని, పేదలకు ఇళ్ల పట్టాలుగా పంచేందుకు కాదంటూ రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పేదలను ఇక్కడకు తీసుకొచ్చి పట్టాలిస్తామంటే ఎలాగని వారు అధికారులను నిలదీస్తున్నారు. తాము పేదలకు పట్టాలు ఇవ్వడానికి వ్యతిరేకం కాదని అయితే తమ భూములు మాత్రం ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. ఒకపక్క రాజధాని అమరావతి కోసం పోరాటం చేస్తుంటే ప్రభుత్వం కావాలని ఈ తరహా చర్యలకు పాల్పడుతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సర్వేలను చేయనిచ్చేది లేదన్నారు రాజధాని రైతులు. మరోవైపు అధికారులు రైతుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు