విజయవాడలో మరో సొరంగ మార్గం:బెజవాడ అనే పేరు ఇలా వచ్చిందట!
Recommended Video
విజయవాడ:కొండలు మెండుగా కనిపించే విజయవాడ నగరంలో మరో నూతన సొరంగ మార్గం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెజవాడగా బాగా ఫేమస్ అయిన ఈ పాత నగరంలో ఎటు నుంచి ఎటు ప్రయాణించాలన్నా కొండల చుట్టూ తిరిగివెళ్లాల్సి రావడం కద్దు.
విపరీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్ కారణంగా ఈ నగరంలో అతి తక్కువ దూరం ప్రాంతాల మధ్య ప్రయాణానికి సైతం చాలా సమయం పడుతోంది. ఉదాహరణకు ఒకే వైపు ఉండే గుణదల-బెంజ్సర్కిల్ మధ్య ప్రయాణానికి సైతం గంటకు పైగా సమయం వెచ్చించాల్సివస్తోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కొండల గుండా సొరంగ మార్గాన్ని ఏర్పాటుచేస్తే ప్రయాణ దూరాన్ని, సమయాన్ని తగ్గించవచ్చన్న నిపుణుల సూచనపై విఎంసీ చర్యలు ఆరంభించింది.
ఇదీ నగర జనాభా...వాహనాల సంఖ్య
విజయవాడ వస్త్ర, వాణిజ్య రంగాలతో సహా వివిధ వ్యాపారాలకు వాణిజ్య కేంద్రంగా ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు నగరానికి నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. 2001 లెక్కల ప్రకారం 8 లక్షల 51వేలకు పైగా జనాభా ఉన్నట్లు అంచనా...2006 కి వచ్చే సరికి ఆ సంఖ్య పది లక్షలకు చేరుకుంది. ఇక విజయవాడలో నిర్మితమై ఉన్న 1264 కిలోమీటర్ల రోడ్లపై నిత్యం 250కి పైగా ప్రైవేటు బస్సులు (పర్మిటెడ్) హైదరాబాద్, చెన్నై, విశాఖపట్టణం వంటి ఇతర ప్రాంతాలకు నడుస్తుంటాయి. వాటితోపాటు 8లక్షల ద్విచక్ర వాహనాలు, 36వేల ఆటోలు, 50వేలకు పైగా కార్లు, 30వేలకు పైగా లారీలు నగరంలో ప్రయాణిస్తున్నాయి.
ట్రాఫిక్ సమస్య...నివారణ కోసం
విజయవాడలో విపరీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్ సమస్యను కొంతైనా తట్టుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై విఎంసి సీరియస్ గా ప్రయత్నాలు ఆరంభించింది. ఆ క్రమంలో కొండల మధ్య మరో సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేస్తే నగరంలో మరి కొన్ని ప్రాంతాల మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించవచ్చని నిపుణులు సలహా ఇచ్చారు. ఈ సలహాపై సానుకూలంగా స్పందించిన వీఎంసీ ఆ దిశగా చర్యలు ఆరంభించింది. ఆ క్రమంలోనే రూ. 200 కోట్ల అంచనాలతో వీఎంసీ ఆర్ఎఫ్పీలను ఆహ్వానించింది.
ఆర్ఎఫ్పీలకు...అనూహ్య స్పందన
నగరంలో మరో సొరంగ మార్గం నిర్మాణం కోసం. రూ.200 కోట్ల అంచనాలతో వీఎంసీ ఆహ్వానించిన ఆర్ఎఫ్పీలకు (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి అంచనాలకు మించిన అనూహ్య స్పందన వస్తోంది. ఈ ఆర్ఎఫ్పీల కోసం పెట్టిన గడువు ఈ నెల 26తో గడువు ముగుస్తుండగా మరికొన్ని రోజులు పెంచాలంటూ వీఎంసీకి పెద్ద ఎత్తున వినతులు వస్తున్నట్లు తెలిసింది. విజయవాడలో 60వ దశకంలో కేఎల్ రావు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఏర్పాటుచేసిన సొరంగ మార్గం నేటికీ లక్షలాదిమంది ప్రయాణికులకు ఉపయోగపడుతోంది.
బెజవాడ పేరు...వచ్చింది ఇలా...
నగర శివారు ప్రాంతాలైన భవానీపురం, విద్యాధరపురం, కబేళా పరిసర ప్రాంత వాసులు అతి తక్కువ సమయంలో నగరంలోకి రావడానికి ఉన్న ఏకైక మార్గం సొరంగం. కేఎల్ రావు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ సొరంగ నిర్మాణానికి పునాదులు పడ్డాయి. 60వ దశకంలో నిర్మాణమైన ఈ సొరంగ మార్గం...అప్పట్లో విజయవాడకు బెజవాడ అనే పేరు రావడానికి ఈ సొరంగమే కారణమనే వాదనలు ఉన్నాయి. ఈ సొరంగం పూర్తయ్యే నాటికి విజయవాడలో అక్షరాస్యుల శాతం చాలా తక్కువని...గ్రామీణుల రాకపోకలు ఎక్కువగా ఉండేవని చెబుతారు. దీంతో గ్రామీణులు అప్పట్లో ఈ సొరంగాన్ని బెజ్జంగా వ్యవహరించేవారు. బెజ్జం ఉన్న ఊరు కాబట్టి విజయవాడ కాస్తా...బెజ్జంవాడగా...కాలక్రమంలో బెజవాడగా విజయవాడ బాగా ప్రసిద్ధి చెందిందనేది వారి వాదన.
అదే తరహాలో...మరో సొరంగ మార్గం
అదే తరహాలో నగరంలో కొండల మధ్య నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల మేర సొరంగాన్ని ఏర్పాటుచేయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దీని కోసం జూన్ 6న ఆర్ఎఫ్పీలను ఆహ్వానిస్తున్నట్టు వీఎంసీ ప్రకటించగా...ఢిల్లీ నుంచి రెండు అంతర్జాతీయ సంస్థలు, కోల్కతా వంటి నగరాలతో పాటు స్వీడన్ వంటి ఇతర దేశాల నుంచి పలు అంతర్జాతీయ సంస్థలు డీపీఆర్లు సిద్ధం చేయడానికి పోటీ పడుతున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం గుణదల, క్రీస్తురాజపురం, మొగల్రాజపురం, లయోలా కళాశాల, 65వ నెంబరు జాతీయ రహదారి మీదుగా ప్రయాణించే వాహనాలు, పాదచారుల కోసం గుణదల కొండ కిందగా జాతీయ రహదారి వైపునకు గానీ మొగల్రాజపురం వైపునకు గానీ ఏర్పాటుచేయాలని వీఎంసీ భావిస్తోంది. లేకపోతే విద్యాధరపురం కొండకు ప్రస్తుత సొరంగ మార్గం కాకుండా మరో మార్గానికి సన్నాహాలు చేసే అవకాశముంది.