ఈఎస్ఐ స్కామ్: తవ్వేకొద్దీ ట్విస్టులే: ఏసీబీ రాడార్లో: ఆ 8 మంది ఏమయ్యారు?: ఫోన్ స్విచాఫ్
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టుల పర్వం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండుమూడు రోజుల్లో మరిన్ని అరెస్టులు చోటు చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ శాసనసభా పక్ష ఉపనేత, కార్మిక శాఖ మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సహా ఎనిమిది మంది వరకు అరెస్టు అయ్యారు. మున్ముందు మరిన్ని అరెస్టులు నమోదు కావచ్చని సమాచారం.
ఈఎస్ఐ కుంభకోణం కేసును ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు రమేష్ కుమార్ వంటి వారిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తును వేగవంతం చేశారు. ఇందులో భాగంగా.. ఇప్పటికే అరెస్టయిన వారిని విచారించగా.. మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో సచివాలయం ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఏసీబీ రాడార్లో ఉన్నారు వారంతా.
సచివాలయంలోని కార్మికశాఖ కార్యాలయం ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. ఇప్పటిదాకా ఎనిమిది ఉద్యోగుల పేర్లు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. వారి గురించి ఆరా తీస్తున్నారు. ఈ ఎనిమిది మందికీ ఫోన్ చేయగా.. స్విచ్డ్ ఆఫ్ వస్తున్నట్లు చెబుతున్నారు. వారి కాల్డేటా, ఏ లొకేషన్లో సెల్ఫోన్ స్విచాఫ్ అయిందనే విషయాన్ని సెల్ టవర్ సిగ్నళ్ల ఆధారంగా పసిగట్టే పనిలో ఏసీబీ అధికారులు నిమగ్నమైన ఉన్నట్లు సమాచారం. ఆ ఎనిమిది మందీ పరారీలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
ఈఎస్ఐ కుంభకోణంలో కనీసం 154 కోట్ల రూపాయలు దుర్వినియోగమైనట్లు ఏసీబీ అధికారులు ఇదివరకే గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న ఉద్యోగుల సంఖ్య పరిమితంగా ఉండకపోవచ్చని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇప్పటికే ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్ కుమార్ వంటి వారిని అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా వారి నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. ఈ సందర్భంలోనే ఎనిమిది మంది సచివాలల ఉద్యోగుల పేర్లు వెల్లడైనట్లు చెబుతున్నారు.
ఈ కుంభకోణంలో ఆ ఎనిమిది మంది ఉద్యోగుల పాత్ర ఎలాంటిదనే విషయంపై ఏసీబీ అధికారులు కూపీ లాగుతున్నారు. మందుల కొనుగోళ్లు, వైద్య పరికరాల కొనుగోళ్లకు సంబంధించిన నోట్ఫైళ్లను కార్మిక శాఖ కమిషనర్, ముఖ్య కార్యదర్శి వంటి ఉన్నత స్థాయి అధికారుల వద్దకు పంపించలేదని ప్రాథమికంగా నిర్ధారించారు. ఫలితంగా ఈ తతంగం మొత్తం కార్మికశాఖ ఉన్నతాధికారుల దృష్టికి చేరలేదని ఏసీబీ అధికారులు భావిస్తున్నట్లు చెబుతున్నారు.