తెలంగాణ టు ఏపీ..లోకల్ స్టేటస్ మరో రెండేళ్లు: విద్య..ఉద్యోగాల్లో కోటా: రాష్ట్రపతి ఉత్తర్వులు..!
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చి విద్య, ఉద్యోగాల్లో స్థానిక కోటా రిజర్వేషన్లు పొందాలనుకుంటున్న వారికి దరఖాస్తు చేసుకునే సమయాన్ని మరింత పెంచారు. ఆంధ్రప్రదేశ్ లో స్థానికత కోసం దరఖాస్తు చేసుకునే సమయాన్ని మరింత పెంచారు. గతంలో మూడేళ్లు సమయం ఇచ్చి... ఆ తర్వాత ఐదేళ్లకు పెంచగా... ఇప్పుడు దాన్ని ఏడేళ్లకు పెంచుతూ గెజిట్ జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్రం.. ఈ మేరకు రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. దీంతో..ఆయన ఆమోదంతో కేంద్ర హోం శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ. ఈ ఉత్తర్వులు ద్వారా తెలంగాణ నుంచి వచ్చేవారు 2021 జూన్ 1వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణ టు ఏపీ..ఇక లోకల్..
రాష్ట్ర విభజన కారణంగా అప్పటి వరకు ఉన్న కామన్ స్టేటస్ ఏపీ..తెలంగాణ గా విడిపోయింది. దీని కారణంగా ఏపీలో మూలాలు ఉన్న వారు విద్య..ఉపాధి కోసం హైదరాబాద్ కు వెళ్లటంతో వారికి తెలంగాణ స్థానికత దక్కింది. అందులో ఏపీలో పని చేసే ఉద్యోగుల పిల్లలు..ఇప్పుడు ఏపీకి తిరిగి రావాలనుకుంటున్న వారి కోసం ప్రభుత్వం తిరిగి వచ్చే వారికి స్థానికత ఇచ్చేందుకు విభజన తరువాత అంగీకరించింది. అయితే, అప్పట్లో పెద్దగా అక్కడ నుండి ఏపీకి రావాటానికి విద్యార్దులు..ఉద్యోగులు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో..ఆ సమయాన్ని పెంచుతూ వస్తున్నారు. దీని ద్వారా ఇప్పుడు తెలంగాణ నుండి ఏపీకి వచ్చే వారికి లోకల్ స్టేటస్ దక్కనుంది. అందుకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అందులో భాగంగానే గడువును సైతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
2021 వరకు గడువు పెంపు..
తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేవారు స్థానిక హోదా(లోకల్ స్టేటస్) పొందడానికి గడువును కేంద్ర ప్రభుత్వం మరో రెండేళ్లు పొడిగించింది. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చేవారికి 2021 జూన్ ఒకటో తేదీ వరకూ స్థానిక హోదా పొందడానికి అవకాశం లభించనుంది. తెలంగాణలో నివాసం ఉంటూ ఆంధ్రప్రదేశ్కు వచ్చేవారికి ఇక్కడ లోకల్ స్టేటస్ పొందడానికి కేంద్ర ప్రభుత్వం మొదట మూడేళ్లు గడువు ఇచ్చింది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370(డి)లోని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రాష్ట్రపతి ఆమోదంతో సవరించింది. దీనిప్రకారం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ రోజైన 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 1 వరకు లోకల్ స్టేటస్ సర్టిఫికెట్లు పొందవచ్చని 2016 జూన్ 16న కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది.
ఉద్యోగాల్లోనూ స్థానిక కోటా..
ఉద్యోగాల్లో స్థానిక హోదాను మరో రెండేళ్లు పొడిగించడం కోసం ఇదే తరహాలో రాష్ట్రపతి ఆమోదంతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) అమెండ్మెంట్ ఆర్డర్-2019 చేసింది. దీంతో తెలంగాణ నుంచి 2021 జూన్ 1వ తేదీలోగా ఆంధ్రప్రదేశ్కు వచ్చినవారు నిబంధనల ప్రకారం స్థానికత సర్టిఫికెట్లు తీసుకోవచ్చు. ఉన్నత విద్యా సంస్థల్లో, ప్రత్యక్ష ఉద్యోగ నియామకాల్లో స్థానిక కోటా కింద రిజర్వేషన్లు పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. స్థానికత కోరుకుంటున్న వారు మీ-సేవా ద్వారా దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లోగా సంబంధిత తహసీల్దార్ డిజిటల్ సంతకంతో కూడిన లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ జారీ చేస్తారు.