పోలవరం నీటిపై ఏపీ-తెలంగాణ వాటా పోరు -గోదావరి నుంచి కృష్ణాకి మళ్లించే వాటాపై పేచీ..
2014లో ఏపీ విభజన తర్వాత మొదలైన జల వివాదాల పర్వం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇప్పటివరకూ ఇరు రాష్ట్రాల్లో అవతలి వారు అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై పోరాడుతున్న ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తాజాగా అన్ని అనుమతులు ఉన్న ప్రాజెక్టుల నీటిపైనా కొత్త వివాదాలను తెరపైకి తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా పోలవరం వంటి జాతీయ ప్రాజెక్టు నుంచి తరలించే నీటి విషయంలోనూ ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు తెరపైకి రావడంతో ఇక్కడ కృష్ణా, గోదావరి రివర్ బోర్డుల పాత్ర ప్రశ్నార్ధకమవుతోంది.
పోలవరం వాటాపై మాదంటే మాది..
ఏటా లక్షల క్యూసెక్కుల గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఏపీ సర్కారు ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో గోదావరి నుంచి పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణానదికి తరలించే జలాలు మాకే చెందాలని ఏపీ, కాదు మాకే కేటాయించాలని తెలంగాణ పట్టుబడుతున్నాయి. వాస్తవానికి తెలంగాణ కోరుతున్నది నేరుగా గోదావరి వాటా కాదు. గోదావరి నుంచి కృష్ణానదికి మళ్లించే జలాలకు సమానంగా తాము కృష్ణానది నీటిని తీసుకుంటామని. కానీ ఏపీ మాత్రం తమకు వాటా ఉన్న గోదావరి జలాలనే కృష్ణాకు మళ్లించుకుంటున్నామని, తద్వారా కృష్ణాలో మిగిలే నీటిని కరువు జిల్లాలైన ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు ఇస్తామని చెబుతోంది. దీంతో ఈ పేచీ ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు.
మొత్తం వాటా 45 టీఎంసీలు...
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్లించే నీటి వాటా 45 టీఎంసీలు. అంతే మొత్తాన్ని కృష్ణాలో ఏపీ తీసుకుంటున్న వాటాలో కోత విధించి తమకు కేటాయించాలని రివర్ బోర్డును తెలంగాణ కోరుతోంది. మరోవైపు గోదావరి నీటిని తెలంగాణ కూడా ఏపీకి రాకముందే తన ప్రాజెక్టులకు మళ్లించుకుంటోంది. ఇందులో దిగువ రాష్ట్రమైన ఏపీని వాటా కోరకుండా తెలంగాణ ఆపలేదని గతంలో బచావత్ ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. దీంతో ఇరు రాష్ట్రాలు గోదావరి నీటిని కృష్ణానదికి మళ్లించుకుంటూ ఇక పోలవరం నీటి విషయంలో తెలంగాణ వాటా ఎలా కోరుతుందని ఏపీ ప్రశ్నిస్తోంది.
దాచుకుని వాడుకునే నీటిపైనా...
నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటి వాడకంపై ప్రతీ ఏటా రివర్ బోర్డులు ఏపీ, తెలంగాణకు వాటాలు కేటాయిస్తున్నాయి. అలాగే వాటిని పూర్తిగా వాడుకోలేని సందర్భాల్లో ఆయా ప్రాజెక్టుల్లోనే దాచుకుని మరుసటి ఏడాది వాడుకునే అవకాశం బచావత్ ట్రైబ్యునల్ కల్పించింది. కానీ గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏర్పాటైన కృష్ణా ట్రైబ్యునల్ పదవీకాలం పూర్తయింది. ఆ తర్వాత రెండో ట్రైబ్యునల్ అమల్లోకి వచ్చింది. అయితే గతంలో బచావత్ ట్రైబ్యునల్ తీర్పును కృష్ణా ట్రైబ్యునల్ -2 కూడా అమలు చేసేందుకు సరేనంది. కానీ అది ఇంకా కేంద్ర ప్రభుత్వ గెజిట్ లో ప్రచురించలేదు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు కేటాయించిన వాటాల్లో దాచుకున్న నీటిని తెలంగాణ ఇప్పుడు వాడుకునేందుకు సిద్దమవుతోంది. దీనిపైనా ఏపీ అభ్యంతరాలు చెబుతోంది.
Recommended Video
రివర్ బోర్డుల అసమర్ధత....
ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టులు, వాటి డీపీఆర్ లు, వాటి నిర్మాణాల తీరును ఎప్పటికప్పుడు పరిశీలించి వాటాలు కేటాయించాలని సూచించే అధికారం రివర్ బోర్డులకు ఉంది. రివర్ బోర్డులు చెప్పినట్లు రెండు రాష్ట్రాలు నడుచుకోవాల్సిందే. కానీ రివర్ బోర్డులే తమ సమావేశాల మినిట్స్ ను సరిగా నోట్ చేయకపోవడం, మినిట్స్ పై సైతం అభ్యంతరాలు వ్యక్తం కావడం వంటి సమస్యలతో జలవివాదాలు మరింత జటిలంగా మారుతున్నాయి. అంటే ఓ రకంగా సమస్యలను తగ్గించాల్సిన రివర్ బోర్డులే ఒత్తిళ్లకు లొంగిపోయి, నిర్లక్ష్యం ప్రదర్శించి సమస్యను పెద్దది చేసేందుకు కారణమవుతున్నాయనే వాదన వినిపిస్తోంది.