సీఎం జగన్ అందించనున్న మరో సంక్షేమ పథకం: వైఎస్సార్ కాపరి బంధు
ఏపీ ప్రభుత్వం పుట్టెడు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గటం లేదు. ఇప్పటికే అమ్మ ఒడి, వైఎస్సార్ రైతు భరోసా వంటి ఎన్నో మహత్తర పథకాలను అందిస్తున్న వైసీపీ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుంది. ఇక అంతేకాదు తాజాగా గొర్రెల, మేకల కాపరులకు కూడా ఆర్ధిక చేయూతనందించే పథకానికి శ్రీకారం చుట్టింది.
గొర్రెల కాపరుల కోసం సీఎం జగన్ నిర్ణయం
గొర్రెల కాపరుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలులోకి తీసుకు రానుంది. ఈ కొత్త స్కీం ద్వారా గొర్రెల కాపరులకు లబ్ది చేకూరనుంది . రాష్ట్రంలోని గొర్రెల కాపరులు ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి తమ జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు ఒక పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఇక ఈ నేపధ్యంలోనే ‘వైఎస్సార్ కాపరి బంధు' పేరుతో కాపరులకు ఆర్దిక చేయూత అందించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు .
ఒక్కో లబ్ధిదారునికి 20 గొర్రెలు, ఒక పొట్టేలు కొనుగోలు చేసేందుకు ఆర్థిక సాయం
ఇక వైఎస్సార్ కాపరి బంధు పేరుతో అందించనున్న ఈ స్కీం ద్వారా ఒక్కో లబ్ధిదారునికి 20 గొర్రెలు, ఒక పొట్టేలు కొనుగోలు చేసేందుకు ఆర్థిక సాయం చేయనుంది. ఎన్సీడీసీ ఆర్థిక సాయంతో ‘వైఎస్సార్ కాపరి బంధు' పథకాన్ని అమలు చెయ్యటమే కాదు యూనిట్ల కొనుగోలుకు మంజూరు చేసే రుణంలో 30 శాతం సబ్సిడీ కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
గొర్రెల రేట్లు అధికంగా ఉండటంతో ఒక యూనిట్ అంటే 20 గొర్రెలు, ఒక పొట్టేలు కొనుగోలుకు రూ.1.50 లక్షలు మంజూరు చేయనుంది.
Recommended Video
నాలుగు సంవత్సరాలకు 50 వేల మంది లబ్ధిదారులకు వర్తించేలా స్కీమ్
సంవత్సరానికి 12,500 మంది చొప్పున నాలుగు సంవత్సరాలకు 50 వేల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలిగించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. ఎన్సీడీసీ ఈ పథకానికి తొలుత రూ.200 కోట్లు కేటాయించేందుకు అంగీకరించిందని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వైఎస్సార్ పశు నష్ట పరిహారం, రాజన్న పశు వైద్యం వంటి పథకాలను అమలులోకి తీసుకువచ్చింది. వీటితోపాటు సబ్సిడీపై పశువుల దాణా, పరికరాలను అందిస్తోంది. ఇక తాజాగా గొర్రెలు కొనుగోలు కోసం వైఎస్సార్ కాపరి బంధు పథకం తీసుకువచ్చి కాపరులకు సైతం లబ్ది చేకూర్చే నిర్ణయం తీసుకుంది.