వరుస వివాదాల్లోఆమంచి ... నా కుటుంబాన్ని కాపాడండి అంటూ ఆమంచిపై మరో వైసీపీ నేత ఫిర్యాదు
ఏపీలో ఎన్నికల్లో వైసిపి ప్రభంజనం కొనసాగినా ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో ఆ నేత మాత్రం ఘోర ఓటమి పాలయ్యారు. ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికలకు ముందు నుంచి వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసిపిలోకి పార్టీ ఫిరాయించిన ఆమంచి చీరాలలో టిడిపి సీనియర్ నేత కరణం బలరాంపై 17 వేల ఓట్ల భారీ మెజారిటీతో పరాజయం పొందారు.
ఎన్నికల్లో ఓటమిపాలైనా వరుస వివాదాల్లో నిలుస్తున్న వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్
రాష్ట్రమంతా ఫ్యాను గాలి వీస్తున్న సమయంలో చీరాలలో ఓటమికి మాత్రం ఆమంచి వ్యక్తిగత ప్రవర్తనే కారణమని పలువురు విమర్శించారు. ఇక ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన ఆమంచి కుటుంబం ఎన్నికలు ముగిసినప్పటినుంచి స్థానికంగా ఉన్న ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుండటంతో పలువురు ఆయన విషయంలో రోడ్డెక్కారు. భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు అంటూ ఫిర్యాదులు చేస్తున్నారు.
ఇటీవల ఆమంచి అన్న కుమారుడు ఆమంచి రాజేంద్ర హోంగార్డు బండబూతులు తిడుతూ ఉన్న ఆడియో క్లిప్ వైరల్ అయింది.రాజేంద్ర నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ హోంగార్డ్ రవికుమార్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. స్థానికంగా ఇది చర్చనీయాంశంగా మారింది. ఇక తాజాగా ఓ మాజీ ఎంపీటీసీ ఆమంచి అనుచరుల నుంచి తన ఆస్తులకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతూ కలెక్టరేట్ ముందు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది.
ఆమంచి బారి నుండి రక్షించండి అని కలెక్టర్ ను, ఎస్పీని కోరిన వైసీపీ నేత మాజీ ఎంపిటిసి కోడూరి వెంకటేశ్వర్లు
ఒంగోలులో నిర్వహించే స్పందన కార్యక్రమంలో చీరాల మండలం పుల్లరిపాలెం తాజా మాజీ ఎంపిటిసి కోడూరి వెంకటేశ్వర్లు తన ఆస్తులకు, తన కుటుంబానికి ఆమంచి నుండి రక్షణ కల్పించాలని వైసిపి నేత తాజా మాజీ ఎంపిటిసి కోడూరు వెంకటేశ్వర్లు కలెక్టర్ ను కోరారు. అంతేకాదు ఆమంచి వల్ల తను ఎంతగా ఇబ్బంది పడుతున్నాడంటే బయటకు వచ్చిన వెంటనే వెంకటేశ్వర్లు తనతో పాటు తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే బాధితుడిని రిమ్స్ కు తరలించారు.
ఇక వైసీపీ ఆవిర్భావం నుంచి వైసీపీలో ఉన్నానని జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశానని, ఆ పార్టీ ఎంపీటీసీగా కూడా ఉన్నానని చెప్పిన వెంకటేశ్వర్లు తాజాగా ఆమంచి అనుచరులు తన వద్దకు వచ్చి తనపై లేనిపోని అభాండాలు వేశారని వాపోయాడు. ఆమంచి ఎన్నికల్లో ఓటమి పాలు కావడానికి, తనకు ఏ సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ నీ భూమిని... ఇంటిని లాగేసుకుంటున్నామని, నువ్వు ఊళ్లో ఉండడానికి వీళ్లేదని హుకుం జారీ చేశారని వెంకటేశ్వర్లు లబోదిబోమంటున్నారు.
వివాదాస్పదుడుగా మారుతున్న ఆమంచి .. జగన్ చర్య తీసుకోకుంటే పార్టీకి కష్టమే అంటున్న శ్రేణులు
ఆమంచి బెదిరింపులపై వేటపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా పోలీసులు పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమంచి ఒత్తిళ్లకు పోలీసులు కూడా తలొగ్గుతున్నారని వెంకటేశ్వర్లు ఆరోపిస్తున్నారు. ఆమంచి అనుచరులు చేసిన దాడిలో తన భార్య మంగమ్మ వేలు కూడా విరిగిపోయిందని పేర్కొన్న బాధితుడు ఎస్ పి ని కలిసి తన కుటుంబానికి ఆమంచి నుంచి రక్షణ కల్పించాలని లేకుంటే మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడ్డారని అంటున్నారు.
అటు ఎన్నికల్లో గెలవక, ఇటు స్థానికంగా ఉన్న వైసిపి నేతలతోనే పొసగక, రోజుకు ఒక వివాదాన్ని కొనితెచ్చుకుంటున్న ఆమంచి కృష్ణమోహన్ వ్యవహారశైలిపై వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చర్య తీసుకోకుంటే ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితి దారుణంగా తయారవుతుందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.