'ఎంగిలి మెతుకులొద్దు': ఓటమి తెలియని సుజయ, జగన్కు గట్టి దెబ్బే
విజయనగరం/విజయవాడ: తాము ఎంగిలి మెతుకులకు కక్కుర్తిపడే మనుషులం కాదని, పదవులకు, పచ్చనోట్లకు లొంగే ప్రసక్తి లేదని కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి భర్త, వైసిపి యువజన విభాగం ప్రధాన కార్యదర్శి శత్రుచర్ల పరీక్షిత్ రాజు అన్నారు. తన కుటుంబం, తమ నియోజకవర్గం జగన్ వెంటే నడుస్తుందన్నారు.
పుష్పశ్రీవాణి పార్టీ మారుతుందనే ప్రచారంపై ఆయన బుధవారం నాడు స్పందించారు. ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా తాము వైసిపిలోనే ఉంటామని చెప్పారు. అవసరమైతే పదవులు వదులుకుంటాం కానీ, జగన్ను విడిచి పెట్టమని చెప్పారు. తమపై విశ్వాసం ఉంచి జగన్ కురుపాం సీటు ఇచ్చారన్నారు.
బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు పార్టీ మారారు. అదే సమయంలో కురుపాం ఎమ్మెల్యే కూడా పార్టీ మారుతారనే ప్రచారం సాగింది. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి గెలిచిన ఎమ్మెల్యేలు వెళ్లిపోతే ప్రతిపక్షం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ, ఆయన సోదరుడు బేబీ నయన టిడిపిలో చేరిన విషయం తెలిసిందే.
పుష్పశ్రీవాణి సుజయ
ఓ వైపు బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు తెలుగుదేశం పార్టీలో చేరారు. మరోవైపు కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి భర్త చేరికల పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
టిడిపిలోకి సుజయ
విజయనగరం జిల్లా బొబ్బిలి రాజకీయం వేడెక్కింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు, సోదరుడు బేబి నయన టిడిపిలో చేరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సైకిల్ ఎక్కినట్లు వీరు చెప్పారు. దీంతో పార్వతీపురం రెవెన్యూ డివిజన్లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.
టిడిపిలోకి సుజయ
నియోజకవర్గంలో రాజుల చేరికతో దాదాపు వైసిపి ఖాళీ అయిందనే చెప్పొచ్చు. వైసిపికి ఉత్తరాంధ్ర ఇంఛార్జిగా ఉన్న ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగరావు చేరడంతో ఇక్కడ దాదాపుగా ఆ పార్టీ ఖాళీ అయిందనే చెప్పాలి.
టిడిపిలోకి సుజయ
రాజులతోపాటు ఆయన అనుయాయులంతా పార్టీ మారడంతో ఇక ఆ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి పనులు సాగాలనే ఉద్దేశంతో అధికార పార్టీలోకి వచ్చినట్లు రాజులు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో చెప్పడంతో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్న అంతా ఆశాభావంతో ఉన్నారు.
టిడిపిలోకి సుజయ
వీరితో పాటు బొబ్బిలి నియోజకవర్గానికి చెందిన వివిధ స్థాయిల్లోని 159 మంది నేతలు టిడిపిలో చేరారు. బొబ్బిలి మున్సిపాలిటీకి చెందిన 11 మంది కౌన్సిలర్లు, బొబ్బిలి ఎంపీపీ గోర్జి వెంకటమ్మ, జడ్పీటీసీ మామిడి గౌరమ్మ, తెర్లాం ఎంపీపీ పార్వతి, తెర్లాం జడ్పీటీసీ వెంకటరామలక్ష్మి, సీతానగరం ఎంపీపీ బొన్నాడ రామకృష్ణ, మరికొందరు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, మాజీ ఎంపీపీలు పార్టీలో చేరినవారిలో ఉన్నారు.
టిడిపిలోకి సుజయ
1999లో బొబ్బిలి రాజులు రాజకీయరంగ ప్రవేశం చేశారు. అప్పటి నుంచి ఇంతవరకు ఓటమి లేకుండా బొబ్బిలి నుంచి గెలుస్తూ వస్తున్నారు.
టిడిపిలోకి సుజయ
2004లో బొబ్బిలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి 53,861 ఓట్లు సాధించారు. అప్పట్లో టిడిపి అభ్యర్థి శంబంగి చినప్పల నాయుడుపై 12,690 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
టిడిపిలోకి సుజయ
2009లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి 75,697 ఓట్లు సుజయ కృష్ణ రంగారావు దక్కించుకున్నారు. టిడిపి అభ్యర్థి తెంటు లక్ష్మునాయుడుపై 24,172 ఓట్ల ఆధిక్యాన్ని సంపాదించారు.
టిడిపిలోకి సుజయ
కొద్దికాలంలోనే బొత్స సత్యనారాయణతో విభేదాలు వచ్చాయి. దీంతో ఎన్నికలకు ఏడాది ముందు పార్టీకి, పదవికి రాజీనామా చేసి వైసిపిలో చేరారు.
టిడిపిలోకి సుజయ
2014లో జరిగిన ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీచేసి 23,584 ఓట్లు దక్కించుకున్నారు. టిడిపి అభ్యర్థి తెంటుపై 6,598 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు.
టిడిపిలోకి సుజయ
ఇలా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఓటమి అన్నది తెలియకుండా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇపుడు అధికార పార్టీలో చేరడంతో పార్టీ మరింత పురోగతి సాధిస్తుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.