మూడురోజుల్లో మూడో వైసీపీ ఎమ్మెల్యే: అన్నాబత్తునికి కరోనా పాజిటివ్: వైరస్ కోరల్లో తెనాలి
గుంటూరు: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో మూడువేలకు చేరువగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనికి ఎక్కడ బ్రేక్ పడుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నప్పటికీ.. ఫలితాలను ఇవ్వట్లేదు. లాక్డౌన్ ప్రకటించిన తూర్పు గోదావరి, కర్నూలు, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం వంటి జిల్లాల్లోనూ భారీగా కేసులు నమోదు అవుతున్నాయి.
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులను వదలట్లేదు కరోనా వైరస్. ఇదివరకే విజయనగరం జిల్లా శృంగవరపు కోట, కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యేలు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ సంఖ్య మరింత పెరిగింది. మూడురోజుల్లో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలను కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి, కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కరోనా బారిన పడ్డారు. బియ్యపు మధుసూధన్ రెడ్డి భార్యకు కూడా వైరస్ సోకింది.
తాజాగా గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కరోనా వైరస్ బారిన పడ్డారు. కొద్దిరోజులుగా అనారోగ్యానికి గురైన ఆయనకు వైద్యపరీక్షలను నిర్వహించగా కరోనా పాజిటివ్గా తేలింది. దీనితో అన్నాబత్తుని హోమ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ఐసొలేషన్లో ఉంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించారు. వాటికి సంబంధించిన నివేదికలు ఇంకా అందాల్సి ఉంది. అయినప్పటికీ.. ముందుజాగ్రత్తగా అన్నాబత్తుని కుటుంబ సభ్యులు హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు. చికిత్స తీసుకుంటున్నారు.
Recommended Video
కొద్దిరోజులుగా అన్నాబత్తుని శివకుమార్ తన నియోజకవర్గం పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారని, కరోనా వల్ల ఉపాధిని కోల్పోయిన వారి కోసం సహాయక కార్యక్రమాలను చేపడుతున్నారని అంటున్నారు. ఆ సమయంలోనే ఆయనకు కరోనా వైరస్ సోకి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. గుంటూరు జిల్లాలో శనివారం నుంచి లాక్డౌన్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ ఒక్క జిల్లాలోనే 4,544 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తెనాలి, నరసరావు పేట, గుంటూరు, సత్తెనపల్లి, గురజాల, పొన్నూరు వంటి ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి.