కరోనా బారిన పడ్డ వైసీపీ నేతల జాబితాలో మరో ఎమ్మెల్యే: వైరస్ కేసుల్లో ఆయన జిల్లా టాప్
కాకినాడ: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో శాసన సభ్యుడు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇప్పటికే పలువురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కరోనా కోరల్లో చిక్కుకున్నారు. వారిలో కొందరు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోగా.. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ జాబితాలో వైఎస్ఆర్సీపీకే చెందిన మరో ఎమ్మెల్యే చేరారు. తాజాగా- ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి కరోనా వైరస్ సోకింది. తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు.
జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించగా.. కరోనా పాజిటివ్గా రిపోర్టులు వచ్చాయి. దీనితో ఆయన హోమ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. కరోనా లక్షణాలు స్వల్పంగా కనిపించడంతో తాను వైద్య పరీక్షలను చేయించుకోగా పాజిటివ్గా తేలినట్లు జగ్గిరెడ్డి తెలిపారు. తన ఆరోగ్యం బాగుందని, డాక్లర్ల సలహా మేరకు తాను హోమ్ క్వారంటైన్లో ఉంటున్నానని అన్నారు. తన అనుచరులు గానీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు తన ఆరోగ్యంపై ఆందోళన పడొద్దని సూచించారు.
త్వరలోనే కోలుకుంటానని అన్నారు. నెగెటివ్గా తేలేంత వరకూ తనను ఎవరూ కలవడానికి రావొద్దని సూచించారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు వైద్య పరీక్షలను చేయించుకోవాలని చిర్ల జగ్గిరెడ్డి విజ్ఙప్తి చేశారు. ఇప్పటికే పలువురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. అంబటి రాంబాబు, అన్నాబత్తుని శివకుమార్, శిల్పా చక్రపాణి రెడ్డి, కడుబండి శ్రీనివాస్, కడుబండి శ్రీనివాస రావు, డాక్టర్ సుధాకర్, అన్నే రాంబాబు, కిలివేటి సంజీవయ్య వంటి పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది.
Recommended Video
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదు అయ్యాయి. అత్యధికంగా శనివారం నాటి బులెటిన్ ప్రకారం.. ఈ జిల్లాలో 56930 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 38425 మంది డిశ్చార్జి అయ్యారు. 394 మంది మరణించారు. 18127 కేసులు తూర్పు గోదావరి జిల్లాలో యాక్టివ్గా ఉన్నాయి. ఈ స్థాయిలో కరోనా వైరస్ కేసులు మరే ఇతర జిల్లాలోనూ నమోదు కాలేదు. కరోనా మరణాలు కూడా ఈ జిల్లాలోనే అత్యధికం.