అంతర్వేది రథం: ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి, అధికారులకు మంత్రి వెల్లంపల్లి ఆదేశాలు
అంతర్వేది కొత్త రథం ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి రానుంది. రథం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.95 లక్షలు మంజూరు కూడా చేసింది. ఫిబ్రవరి లోగా అంతర్వేదిలో రథం నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. రథంలో ఏడు అంతస్తులు ఉండేలా నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. రథానికి ఆరు చక్రాలు ఉంటాయని వెల్లడించారు.
అంతర్వేది రథం ఆకృతిలో ఎలాంటి మార్పులు ఉండబోవు అని మంత్రి స్పష్టంచేశారు. ఎప్పటిలాగానే సిద్ధం చేయాలని స్పష్టంచేసినట్టు పేర్కొన్నారు. శిఖరంతో కలిపి మొత్తం 41 అడుగులు ఎత్తు వచ్చేలా కొత్త రథం డిజైన్ సిద్ధమయ్యిందని అధికారులు తెలిపారని మంత్రి ట్విట్ చేశారు. రథం నిలిపే షెడ్డును కూడా పునరుద్ధరించాలని మంత్రి వెల్లంపల్లి సూచించారు. దీనికి ఇనుప షట్టర్ అమర్చాలని నిర్ణయించామని పేర్కొన్నారు. దీంతో లోపలికి ఎవరూ ప్రవేశించే అవకాశం ఉండదు.
Recommended Video
దగ్గమయిన పాత రథానికి రూ.84 లక్షల ఇన్సూరెన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆ బీమా సొమ్ము వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని భావిస్తున్నారు. వచ్చే ఫిబ్రవరిలో అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలు జరగాల్సి ఉండనున్నాయి. బీమా సొమ్ము వచ్చేంత వరకు ఆగకుండా ప్రభుత్వ నిధులతో రథం నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. బీమా సొమ్ము వచ్చాక.. ప్రభుత్వానికి బదిలీ చేస్తారో లేదంటే.. స్వామివారి సేవకు అందజేస్తారో చూడాలీ మరీ. మరోవైపు రథం దగ్ధం ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. రథం దగ్ధంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ప్రతిపక్షాలు సీబీఐ విచారణ కోరడంతో.. ఏపీ సర్కార్ జరిపించాలని నిర్ణయం తీసుకుంది.