అంతర్వేదిలో కొత్త రథం నిర్మాణం ప్రారంభం- టెండర్లు లేకుండా ఎలా అప్పగిస్తారన్న చంద్రబాబు
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దుండగులు దగ్ధం చేసిన రథం స్ధానంలో కొత్త రథం నిర్మాణ పనులు ఇవాళ ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రులు ధర్మాన కృష్ణదాస్. చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఇతర దేవాదాయశాఖ అధికారులు అట్టహాసంగా, శాస్త్రోక్తంగా ఈ పనులను ప్రారంభించారు. భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు, రాబోయే శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి కళ్యాణ ఉత్సవాలకు నూతన రథాన్ని సిద్దం చేస్తామని రెవెన్యూ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మరోవైపు రథం నిర్మాణ పనుల్ని అగ్నికుల క్షత్రియులకు ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అదే సమయంలో టెండర్లు లేకుండా పనులు అప్పగించడంపైనా విమర్శలకు దిగుతున్నాయి.
అంతర్వేదిలో కొత్త రథం నిర్మాణం ప్రారంభం...
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో దుండగుల చేతుల్లో దగ్ధమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం స్ధానంలో మరో కొత్త రథం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇవాళ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, చెల్లుబోయిన వేణు శాస్త్రోక్తంగా పూజలు చేసి ఈ కార్యక్రమం ప్రారంభించారు. తర్వాత స్వామిసన్నిధిలో వేద పండితులు, అర్చక స్వాములు ఆధ్వర్యంలో వైఖానస ఆగమ యుక్తంగా నిర్వహించిన విశ్వక్సేన పూజ, శ్రీ సుదర్శన నరసింహ మహా శాంతి హోమంలో పాల్గొన్నారు.
జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు, దేవాదాయశాఖ అధికారులు, పలువురు ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు. రథం దగ్ధం కావడం అత్యంత దురదృష్టకరమైన ఘటన అని, దీనిపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించామని, దోషులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి ధర్మాన తెలిపారు.
కళ్యాణోత్సవం కల్లా సిద్ధం...
అంతర్వేది రథం వ్యవహారంలో తీవ్ర విమర్శలు రావడంతో కొత్త రథం విషయంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. రథం నిర్మాణం కోసం శ్రేష్టమైన కలపతో పాటు అన్ని రకాల సంప్రదాయాలను పాటిస్తున్నట్లు మంత్రులు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా రథం నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. కళ్యాణోత్సవం నాటికి స్వామి వారం రథం సిద్ధం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు టార్గెట్ పెట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపటి నుంచి రథం నిర్మాణ పనులు కొనసాగబోతున్నాయి. విమర్శలకు తావివ్వని రీతిలో దీన్ని పూర్తిచేస్తామని మంత్రులు తెలిపారు. ఏ విధమైన విమర్శలకు తావు లేకుండా అతి తొందరలోనే రథాన్ని తయారు చేసి స్వామివారి కళ్యాణానికి సిద్దం చేయడం జరుగుతుందని మంత్రి ధర్మాన వెల్లడించారు.
Recommended Video
టెండర్లు లేకుండా పనులేంటన్న చంద్రబాబు...
అంతర్వేది ఆలయ రథం నిర్మాణానికి పనులు మొదలుపెట్టిన ప్రభుత్వం వీటిని టెండర్లు లేకుండానే అప్పగించడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు టెండర్లు లేకుండా పనులేంటని జగన్ సర్కారును ప్రశ్నించారు. ప్రభుత్వం టెండర్లు లేకుండా రథం పనులు అప్పగించడంతో అగ్నికుల క్షత్రియుల మనోభావాలు దెబ్బతిన్నాయని చంద్రబాబు ట్వీట్ చేశారు. రథాన్ని స్వామివారి ప్రతిరూపంగా భావించే ఈ ఆగ్నికుల క్షత్రియులే 1823లో అంతర్వేది ఆలయాన్ని నిర్మించి నిర్వహణ కోసం 1800 ఎకరాల భూమిని ఇచ్చారన్న సంగతిని ప్రభుత్వం మర్చిపోకూడదన్నారు.