ఏవోబీలో ఎన్కౌంటర్: విశాఖ మావోయిస్టు మృతి, తప్పించుకున్న అగ్రనేతలు
విశాఖపట్నం: ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు(ఏవోబీ) ప్రాంతంలో మరోసారి తుపాకీ మోతలు కలకలం సృష్టించాయి. మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారనే సమాచారంతో ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా బెజ్జంగి, గుజ్జేడు ప్రాంతంలో శనివారం సాయంత్రం నుంచి కూంబింగ్ చేపట్టారు.
Recommended Video
ఆ ప్రాంతానికి చేరుకోగానే అక్కడేవున్న మావోయిస్టులు కాల్పులకు పాల్పడటంతో.. పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఘటనా స్థలంలోని మందుపాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. 303 తుపాకీ, పిస్తోల్, 3 కిట్ బ్యాగ్లు, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకున్న మావోయిస్టు అగ్రనేతల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
మావోయిస్టు అగ్రనేత ఆర్కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్ ఉన్నట్లుగా సమాచారం. జులై 28 నుంచి అమరవీరుల వార్షికోత్సవాలను నిర్వహించేందుకు వీరంతా కలిసి చర్చించినట్లు తెలిసింది. ఈ సంఘటనలో కీలక మిలీషియా సభ్యులు పాల్గొన్నారని పోలీసులు తెలిపారు.
కాగా, ఏవోబీలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన మావోయిస్టు పొంగి దయగా గుర్తించినట్లు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా వాకపల్లికి చెందిన దయ.. గత ఆరేళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిఇలావుంటే, ఇంజెరి అటవీ ప్రాంతంలోనూ మరో పోలీసు బృందం కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో ఏవోబీ కార్యదర్శి చలపతి, ఆయన భార్య అరుణ తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. 30 మంది మావోయిస్టులు ఈ కాల్పుల్లో పాల్గొన్నారు. భారీ వర్షం కురిసిన కారణంగా ఇరువర్గాలు కాల్పులు విరమించుకున్నట్లు తెలిసింది.