భక్తుల పూజలందుకుంటున్న పామును...ఎస్ఐ విషం పెట్టించి చంపాడు:దుర్గాడ ప్రజల ఆరోపణ;ఎస్ ఐపై చర్యలు
Recommended Video
తూర్పు గోదావరి:జిల్లాలోని గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలోని పొలాల్లో గత 26రోజులుగా ఉండిపోయి గ్రామస్థులతో పూజలు అందుకుంటున్న పాము గురువారం మధ్యాహ్నం ప్రాణాలు విడిచింది.
ఇన్ని రోజులుగా తమతో పూజలందుకుంటూ, ఎవరినీ ఏమీ చేయని నాగరాజు హఠాన్మరణంతో దుర్గాడ శోకసంద్రమైంది. అయితే పాము మృతికి గొల్లప్రోలు ఎస్ఐ శివకృష్ణ కారణమని ఆరోపిస్తూ, ప్రజలు జాతీయ రహదారిని ఏడు గంటల పాటు దిగ్బంధించారు. ఎస్ ఐ ఆ పాముని విషం పెట్టించి చంపాడని గ్రామస్తులు ఆరోపిస్తుండటంతో ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐపై కేసు నమోదు చేయడంతో పాటు ఆయనను విధుల నుంచి తప్పిస్తున్నట్టు డీఎస్పీ ప్రకటించారు.
పాముకు...భక్తుల పూజలు
తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలోని పొలాల్లో గత 26 రోజులుగా ఉంటూ సుబ్రహ్మణ్యస్వామి అవతారంగా భక్తుల పూజలు అందుకుంటున్న పాము గురువారం మధ్యాహ్నం ప్రాణాలు విడిచింది. ఇన్ని రోజులుగా పొలంలోనే కదలకుండా ఉండిపోవడం తో దైవం వెలసినట్లుగా విశ్వసించిన గ్రామస్థులు పూజలు నిర్వహించడంతోపాటు అక్కడ ఆలయం నిర్మించాలని నిర్ణయించారు. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే పాము విషయం తెలిసి భక్తులు వేలాదిగా తరలివస్తుండటంతో ఈ విషయం తెలిసిన అటవీ, రెవెన్యూ, పోలీసు అధికారులు అక్కడకు చేరుకుని రెండురోజులుగా పరిస్థితి సమీక్షిస్తున్నారు.
ఈ క్రమంలో...పాము హఠాన్మరణం
ఈ పామును పరిశీలించిన పోలీసులు, అటవీ శాఖ అధికారులు పాము పొడపై ఉందని, అందువలనే కదలకుండా ఉండిపోయిందని, ప్రస్తుతం కుబుసం విడుస్తున్నందున పాము వెళ్లిపోతుందని, దానిని వెళ్లనివ్వాలని గ్రామస్థులను కోరారు. అది విషసర్పమని ప్రమాదకరమని గ్రామస్థులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయితే అందుకు గ్రామస్థులు అంగీకరించలేదు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఈ పాము హఠాన్మరణం చెందింది. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. ఆ తరువాత పాము మరణంపై గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఎస్ ఐపై...ఆరోపణలు
26 రోజులుగా తమ మధ్యే పాము ఉంటున్నా, పాము తమకాళ్ల మీదుగా వెళ్లినా ఎవరికీ హాని కలిగించలేదని గ్రామస్థులు తెలిపారు. తమతో పూజలు అందుకున్న పాము ఇలా హఠాత్తుగా చనిపోవడంపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గొల్లపల్లి ఎస్ ఐ ఓ వస్త్రం తెచ్చి, దానిపై మందు వేసి పామును ఆయన చంపించాడని ప్రజలు ఆరోపిస్తున్నారు. కుబుసం విడిచిన తరువాత కూడా ఎక్కడికీ వెళ్లకుండా, తమతోనే ఉన్న పాము వద్ద ఎస్ఐతో పాటు వచ్చిన వ్యక్తి ఓ వస్త్రాన్ని వదిలి వెళ్లాడని, ఆపై కాసేపటికే పాము మృతి చెందిందని గ్రామస్తులు చెబుతున్నారు.
ఆందోళనలు...ఎస్ ఐపై చర్యలు
పాము హఠాన్మరణంపై కలత చెందిన గ్రామస్థులు జాతీయ రహదారి నంబర్ 216పై పెద్ద ఎత్తున ప్రజలు నిరసనలకు దిగారు. రోడ్డుపై మంటలు వేశారు. దీంతో ట్రాఫిక్ ను చెందుర్తి, తాటిపర్తి సెంటర్ మీదుగా మళ్లించిన అధికారులు, దుర్గాడ ప్రజలతో చర్చలకు ఉన్నతాధికారులను పంపారు. కాకినాడ డీఎస్పీ అక్కడికి చేరుకుని, ప్రజలతో చర్చించారు. పాము మరణంకు సంబంధించి ఎస్ఐని వెంటనే విధుల నుంచి తొలగిస్తున్నామని, ఆయనపై కేసు నమోదు చేస్తున్నామని...పాము మృతిపై విచారణ జరిపిస్తామని...పాము మృతికి కారకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయని నచ్చజెప్పడంతో ప్రజలు శాంతించారు.
మరోవైపు...అరుదైన పాము హతం
ఇదిలావుండగా తూర్పు గోదావరి జిల్లాలోనే మరోచోట అత్యంత పొడవైన అరుదైన జాతికి చెందిన పామును స్థానికులు గుర్తించి హతమార్చారు. గంగవరం శివారులోని వ్యవసాయ భూముల వద్ద గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. 15 అడుగుల పొడవు ఉన్న ఈ పామును చూసి భయాందోళనలకు లోనైన యువకులు ఎట్టకేలకు దానిని చంపేశారు. వారంరోజులుగా మేకలు పాముకాటుకు గురవుతుండటంతో అనుమానం వచ్చిన స్థానిక యువకులు గురువారం సాయంత్రం మేకలపాక చుట్టూ అన్వేషించగా ఒక మూలగా చుట్టచుట్టుకొని ఉన్న భారీపామును గుర్తించి చంపేశారు.