ఆత్మరక్షణలో ఏపీ: గన్స్ లేకుండా చంపారని పరకాల
హైదరాబాద్: శేషాచలం ఎన్కౌంటర్ వ్యవహారం వేడెక్కడంతో ఆంధ్రప్రదేశ్ సర్కారు ఆత్మరక్షణలో పడినట్టుగా కనిపిస్తోంది. దీనిపై పరకాల ప్రభాకర్ స్పందించారు. ఎన్కౌంటర్పై ఇటు కేంద్రం, అటు జాతీయ మానవ హక్కుల సంఘం వివరణ కోరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు ఫోన్లో పరిస్థితిని వివరించారు. ఈ ఎన్కౌంటర్ ఆత్మరక్షణార్థం జరిగిందేనని మీడియా సలహాదారు పరకాల గట్టిగా సమర్థించారు.
గతంలో కూడా తాము సమర్థులైన అధికారులను స్మగ్లర్ల దాడిలో కోల్పోయామని ఈ సందర్భంగా పరకాల ప్రభాకర్ చెప్పారు. పొట్టకూటి కోసం బడా స్మగ్లర్ల చేతిలో పావులుగా మారిన తమిళ కూలీలను ఎన్కౌంటర్లో హతమార్చిన తీరుపై తమిళులు తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ సంఘనటతో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకోవడంతో, ఆర్టీసీ బస్సులను నిలిపివేసింది.
మరోపక్క ఎన్కౌంటర్ వ్యవహారంపై వాస్తవాలను వివరించాలంటూ కేంద్రం రాష్ట్రాన్ని ఆదేశించడంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఫోన్లో మాట్లాడారు. ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్న తీరు, రాష్ట్ర ప్రభుత్వం గత పది నెలలుగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. అంతేగాక, గత పదేళ్లలో అప్పటి కాంగ్రెస్ స్మగ్లింగ్ కార్యకలాపాలను ప్రోత్సహించారన్న అభియోగాలు మోపుతూ కారణాలను వివరించారని సమాచారం.
గతంలో శేషాచలం అడవుల్లో పోలీసు, అటవీ శాఖాధికారులను స్మగ్లర్లు చంపిన కేసులనూ చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు, అటవీ సంపదను కొల్లగొడుతున్న కూలీలు పోలీసులపై తిరగబడిన నేపథ్యంలో ఆత్మరక్షణార్ధం పోలీసులు జరిపిన కాల్పుల్లో భాగంగానే ఎన్కౌంటర్ జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ప్రకటించారు.
దాదాపు 200మంది కూలీలు తిరగబడి రాళ్లతో దాడి చేసిన నేపథ్యంలో గస్తీలో కొద్దిమంది మాత్రమే పోలీసులు ఆత్మరక్షణార్ధం కాల్పులు చేశారని చెప్పారు. ఇంతవరకు జరిగిన సంఘటనల్లో స్మగ్లర్ల కాల్పుల్లో ఆరుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారని, ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ జైళ్లలో వెయ్యిమందికి పైగా స్మగ్లర్లు ఉన్నారని తెలిపారు. వేల కేసులు కోర్టులో విచారణలో ఉన్నాయన్నారు. వేలాది వాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నారు.
పోలీసులు ఆత్మరక్షణార్థం చేసిన కాల్పులు మాత్రమేనని, దీన్ని తప్పుదోవబట్టించి అటవీ సంపదను కొల్లగొట్టేవారి కొమ్ముకాయడం తగదని పరకాల ప్రభాకర్ అన్నారు. గతంలో కూడా కొడవళ్లు, కత్తులతో స్మగ్లర్లు పోలీసు, అటవీ శాఖాధికారులను చంపారని గుర్తు చేశారు. తుపాకులు ఉంటేనే ఆయుధం అనుకోరాదని, ఈ ఆయుధం లేకపోయినా స్మగ్లర్లు పోలీసులు చంపారన్నారు.