ఆనం టిడిపిలోనే ఉంటారు, అనుమానాలు లేవు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
అమరావతి: మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరుతారని తాము అనుకోవడం లేదని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు.ఆనం రామనారాయణరెడ్డి టిడిపిలోనే కొనసాగుతారనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి టిడిపిని వీడి వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. వైసీపీకి చెందిన కీలక నేతలు ఆనం రామనారాయణరెడ్డితో ఈ విషయమై చర్చలు జరిపారని కూడ ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారంపై టిడిపి సీనియర్ నేత ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు.
ఆనం రామనారాయణరెడ్డి టిడిపిలోనే కొనసాగుతారని ఆయన చెప్పారు. ఇందులో అనుమానం లేదన్నారు. అనారోగ్యం కారణంగా ఆనం వివేకానందరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు.
తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో ఉన్న ఆనం వివేకానందరెడ్డిని ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పరామర్శించారు. టిడిపిలో చేరే ముందు తమకు ఇచ్చిన హమీలను చంద్రబాబునాయుడు నెరవేర్చలేదని ఆనం సోదరులు అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. ఈ తరుణంలోనే వైసీపీ నేతలు ఆనం రామనారాయణరెడ్డితో చర్చించారని సమాచారం.
ఆనం రామనారాయణరెడ్డి టిడిపిని వీడుతారని మీడియాలో జోరుగా ఊహగానాలు వస్తున్న తరుణంలో ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి మంగళవారం నాడు స్పందించారు. ఆనం రామనారాయణరెడ్డి పార్టీ మారతారని అనుకోవడం లేదన్నారు. టిడిపిలోనే కొనసాగుతారని ఆయన చెప్పారు.
2014 ఎన్నికల సమయంలో ఆనం సోదరులు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అయితే ఏడాదిన్నర క్రితం కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరారు. టిడిపిలో చేరే సమయంలో ఇచ్చిన హమీలను అమలు చేయలేదనే అసంతృప్తి ఆనం సోదరుల్లో ఉందని ఆయన వర్గీయుల్లో ఉంది.