మీ సాయం మరువలేం: ఏపీకి ధన్యవాదాలు తెలిపిన కేరళ
కేరళ/అమరావతి: భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళకు ఆంధ్రప్రదేశ్ అందజేసిన ఇతోధిక సాయానికి అక్కడి ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. ఇంత భారీ మొత్తంలో ఏ రాష్ట్రం కూడా సాయం చేయలేదని వెల్లడించింది. కాగా, వరదల వల్ల కష్టాల్లో ఉన్న కేరళకు ఏపీ ప్రభుత్వం రూ.51 కోట్లకు పైగా సాయాన్ని పంపింది.
కేరళ సచివాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వం తరఫున ఉపముఖ్యమంత్రి చినరాజప్ప చెక్కులు అందించారు. కేరళ సీఎం పినరయి విజయన్ విదేశీ పర్యటనకు వెళ్లడంతో చెక్కులను ఆ రాష్ట్ర పరిశ్రమల మంత్రి జయరాజన్కు అందించారు.
ఉపముఖ్యమంత్రి వెంట రియల్టైం గవర్నెన్స్ సొసైటీ సీఈవో బాబు ఉన్నారు. ఈ సందర్భంగా జయరాజన్ మాట్లాడుతూ.. కష్టకాలంలో అండగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రభుత్వం, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
కేరళను అన్ని విధాల ఆదుకోవడానికి ఏపీ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారని ఉపముఖ్యమంత్రి చినరాజప్ప తెలిపారు. కేరళకు అందించిన రూ.51కోట్ల సాయంలో ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రూ.10కోట్లు, ఏపీ ఎన్జీవోల ఒకరోజు వేతనం రూ.20కోట్లు, తదితరాలు ఉన్నట్లు తెలిపారు.