ఏపీలో కరోనా: పేకాటలో టీడీపీ ఎమ్మెల్సీ.. రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు
ఓవైపు అధినేత చంద్రబాబు.. జగన్ సర్కారుపై పోరాడుతోంటే.. టీడీపీ నేతలు మాత్రం ఫుల్లుగా టైమ్పాస్లో మునిగిపోయారు. సీఎం సొంత జిల్లా కడపలో ఆదివారం పోలీసులు పలు చోట్ల దాడులు చేయగా.. టీడీపీ ఎమ్మెల్సీ దేవగుడి శివనాథ్రెడ్డి పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయారు. గతంలో విజయవాడలో పేకాట ఆడిన ఓ వ్యక్తి ద్వారా 24 మందికి కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో సామూహిక ఆటలు వద్దని పోలీసులు ఆదేశించడం తెలిసిందే. ఆదివారం నాటికి రాష్ట్రంలో కేసుల సంఖ్య 2230కి పెరగడంతో జనం కదలికలపై నిఘా పెంచారు. ఈక్రమంలోనే టీడీపీ ఎమ్మెల్సీ పట్టుపడ్డారు.
కడప జిల్లా జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ఆదివారం పోలీసులు సోదాలు చేపట్టారు. మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.15,700 స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో టీడీపీ ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి కూడా ఉన్నారని పోలీస్ అధికారులు తెలిపారు.
దేవగుడితోపాటు అలాగే మరో రెండు చోట్ల కూడా సోదాలు చేశామని, ఒక చోట ఐదుగురిని, మరో చోట ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని, వారి దగ్గర్నుంచి రూ. 3500, రూ.5000 చొప్పున స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్సీ పేకాట ఆడుతూ దొరికిపోయిన వైనం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గిట్టనివాళ్లే ఆయనపై ఫిర్యాదు చేసి ఉండొచ్చని అనుచరులు అనుమానిస్తున్నారు.