అనంతపురం:వైసీపీ నేత ఇంట్లో కాల్పుల కలకలం
అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసిపి నేత రమేష్ రెడ్డి నివాసంలో గురువారం ఉదయం కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. తాడిపత్రి నియోజకవర్గం కు సంబంధించి వైసిపి పార్టీకి కీలక నేత అయిన రమేష్ రెడ్డి ఇంట్లోకి ఓ దుండగుడు చొరబడ్డాడు.
అతడు రమేష్ రెడ్డిపై దాడికి యత్నించిన నేపథ్యంలో రమేష్ రెడ్డి తన వద్ద ఉన్న లైసెన్స్ డ్ గన్ తో ఆ అగంతకుడిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో ఆ దుండగుడికి కాలి మీద బుల్లెట్ తగిలి గాయపడినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గాయపడిన ఆ అగంతకుడిని తాడిపత్రిలోని ఒక ఆస్పత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నట్లు తెలిసింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అయితే రమేష్ రెడ్డి ఇంట్లోకి చొరబడిందెవరు...? ఎందునిమిత్తం ఆ ఇంట్లోకి చొరబడ్డాడు?... రమేష్ రెడ్డిపై దాడి నిమిత్తం అతనిని ఎవరైనా పంపారా?...తదిదర వివరాలు ఆ అగంతకుడు నోరు విప్పితే గాని బయటకు తెలిసే అవకాశం లేదు. ఈ క్రమంలో ప్రస్తుతం బుల్లెట్ దెబ్బకు గురై ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న ఆ దుండగుడు కొంచెం కోలుకున్న అనంతరం పోలీసులు నేరుగా అతడినే విచారించే అవకాశం ఉంది. అనంతరం ఈ ఘటనపై స్పష్టత లభిస్తుందని, పూర్తి స్థాయిలో విచారణకు తోడ్పడుతుందని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.